CM Revanth Reddy: తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే నా లక్ష్యం: సీఎం రేవంత్రెడ్డి
ABN , Publish Date - Nov 18 , 2025 | 01:29 PM
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్, గోదావరి జలాల తరలింపు, మూసీ ప్రక్షాళనతో పాటు వివిధ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని సూచించారు.
హైదరాబాద్, నవంబరు18(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ 2047 అనుగుణంగా 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా దేశాన్ని తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ని కోరారు.
అనుమతులు వేగంగా జారీ చేయాలి..
వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన అనుమతులు వేగంగా జారీ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఇవాళ(హైదరాబాద్)లో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్, గోదావరి జలాల తరలింపు, మూసీ ప్రక్షాళనతో పాటు వివిధ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని సూచించారు. రాబోయే ఏడాదిలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్ నగరంలో తీసుకురావాలని ప్రణాళికలు వేస్తున్నామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.
డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేయబోతున్నామని తెలిపారు. 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా, 2047 నాటికి మూడో ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. దేశ ఎకానమీలో 10 శాతం ఎకానమీని తెలంగాణ నుంచి అందించాలని భావిస్తున్నామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.
భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి కృషి..
హైదరాబాద్ నగర అభివృద్ధితో పాటు తాము భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో డ్రై పోర్టు ఏర్పాటు చేయాలనే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. తమ పోటీ ఇతర రాష్ట్రాల నగరాలతో కాదని.. తమ పోటీ సింగపూర్, టోక్యో, న్యూయార్క్ నగరాలతో ఉంటుందని.. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని సీఎం రేవంత్రెడ్డి సూచించారు.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో కీలక ఒప్పందం...
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటుకు కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL)తో అవగాహన ఒప్పందాన్ని (MOU) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పందంతో ప్రముఖ డిజిటల్ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందనుంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. బోధన, అభ్యాసం, పరిశోధనలను మెరుగుపరచడానికి ఐడీఈఏ అత్యాధునిక డిజిటల్ హబ్గా పనిచేస్తుంది. టెక్నాలజీ ద్వారా నాణ్యమైన విద్యను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందించనుంది.
తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి తమప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు సీఎం రేవంత్రెడ్డి. రాష్ట్రంలోని యూనివర్సిటీలను బలోపేతం చేయడంతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఒక నాలెడ్జ్ హబ్గా తీర్చి దిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఓఎల్ (COL) అధ్యక్షుడు పీటర్ స్కాట్కు వివరించారు ముఖ్యమంత్రి. ఈ సమావేశంలో కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (COL) అధ్యక్షుడు అండ్ సీఈవో పీటర్ స్కాట్ (Mr. Petor Scott), ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఘంటా చక్రపాణి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
పత్తి రైతుల సమస్యలు పరిష్కరించరా.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
ర్యాగింగ్ కలకలం... పొట్టు పొట్టు కొట్టుకున్న విద్యార్థులు
Read Latest Telangana News And Telugu News