Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు, 9 జిల్లాలకు ఎల్లో అలెర్ట్..
ABN , Publish Date - Aug 16 , 2025 | 02:03 PM
తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం(ఆగస్టు 16) కూడా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో గత కొన్ని రోజులుగా అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. దీంతో, రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. జాగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉదయం నుంచే అనేక మండలాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సిరికొండ ప్రాంతంలో చికమాన్ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగుల ఉద్ధృతితో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటుంది. అలాగే, భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టులో కూడా వరద ముప్పు పెరిగింది. ప్రస్తుతం 2 గేట్లు ఎత్తి 4,571 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 6,484 క్యూసెక్కులుగా ఉంది. వాతావరణ శాఖ, ప్రజలను సురక్షితంగా ఉండాలని, సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కనకగిరి అడవుల్లో నీలిరంగు పుట్టగొడుగు
Read Latest Telangana News and National News