Harish Rao Thimmapur: వీరిది ప్రభుత్వ హత్యే.. తిమ్మాపూర్ డెంగ్యూ మరణాలపై హరీష్ రావు ఫైర్..
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:00 PM
డెంగ్యూ జ్వరంతో చనిపోయిన తిమ్మాపూర్ యువకుల కుటుంబాలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని.. పారిశుద్ధ్యం సరిగా లేక గ్రామాలు పడకేస్తే రేవంత్ సర్కార్ మొద్దునిద్రపోతోందని మండిపడ్డారు.
సిద్దిపేట జిల్లా, తిమ్మాపూర్: సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో డెంగ్యూ జర్వంతో చనిపోయిన మహేష్ (35), శ్రవణ్ కుమార్ (15) అనే యువకుల కుటుంబాలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిమ్మాపూర్ గ్రామంలో 40 నుండి 50 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైరల్ ఫీవర్ చికిత్స కోసం వెళ్లినా ప్రయోజనం లేక.. గ్రామ ప్రజలు ప్రైవేటు వైద్యం కోసం అప్పుల పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో స్పెషల్ డ్రైవ్ పెట్టామని.. ఇప్పుడు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్యం లోపించి గ్రామాలన్నీ పడకేశాయని.. తిమ్మాపూర్లో ఇద్దరు యువకులు డెంగ్యూతో మృత్యువాత పడటానికి రేవంత్ సర్కార్ నిర్లక్ష్యమే కారణమని ఫైర్ అయ్యారు.
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..
ఓ పక్క పారిశుద్ధ్య సమస్యల కారణంగా ప్రజలు డెంగ్యూతో మంచాలెక్కుతున్నారు. తిమ్మాపూర్లో ఇద్దరు యువకులు చికిత్స దొరక్క అన్యాయంగా చనిపోయారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. మరో పక్క గ్రామపంచాయితీల్లో నిధుల్లేక సెక్రటరీలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి అప్పుల పాలయ్యారు. సమ్మె నోటీసులు ఇచ్చినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు.
తిట్టుడు బంద్ జేసి.. పాలన చెయ్..
అసలు మీరేం పాలన చేస్తున్నారు.. ఎంత సేపు ప్రతిపక్ష నాయకులపై పడి ఏడవడం.. కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడం తప్ప అని.. రేవంత్ సర్కార్ పై సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బార్లలో మందులు ఫుల్ అని.. ఆస్పత్రుల్లో మందుల్ నిల్ అని మండిపడ్డారు. ఎంతసేపూ వైన్స్, బార్లు పెడతా అంటుంటారే తప్ప ఒక బస్తా యూరియా మాత్రం ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఊర్లకు యూరియా లారీలు వచ్చాయి. 26 వేల మెట్రిక్ టన్నుల యూరియా గజ్వేల్ రేక్ పాయింట్లో పెట్టాం. కానీ, రేవంత్ హయాంలో ఒక్క యూరియా బస్తా దొరికితే లాటరీ దొరికిన పరిస్థితి. ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో కూర్చుని నీతులు చెప్పడం మానుకోవాలి. తిట్టుడు బంద్ జేసి పాలనపై దృష్టి పెట్టాలని హరీష్ రావు హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాలమూరు జిల్లా బిడ్డ.. జాతీయ నేతగా ఎదగడం గర్వకారణం
స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్
For More Telangana News And Telugu News