Brave Soldier Murali Naik: తెలుగు జవాను వీరమరణం
ABN , Publish Date - May 10 , 2025 | 03:13 AM
జమ్ముకశ్మీర్లో పాక్ సైన్యంతో పోరాడుతూ వీరమరణం పొందిన తెలుగు అగ్నివీర్ మురళీ నాయక్ దేశం కోసం తన ప్రాణాలను అర్పించాడు. కన్నతండ్రి ఆశయంగా దేశరక్షణను ఎంచుకున్న మురళికి రాష్ట్ర ప్రభుత్వం, నాయకులు నివాళులు అర్పించారు

పాక్ సైనికులతో వీరోచితంగా పోరాడుతూ అమరుడైన అగ్నివీర్ మురళీనాయక్
ఆపరేషన్ సిందూర్ కోసం జమ్ము సరిహద్దులకు
అంతకుముందే తల్లిదండ్రులతో ఫోన్లో కబుర్లు
అమ్మానాన్న జాగ్రత్త అంటూ స్నేహితుడికి ఫోన్
తర్వాత గంటల వ్యవధిలోనే అమరుడైన మురళి
జవాను కుటుంబానికి సీఎం పరామర్శ.. 5 లక్షల సాయం
నేడు శ్రీ సత్యసాయి జిల్లా కళ్లితండాకు భౌతికకాయం
పుట్టపర్తి/హిందూపురం/అమరావతి/ఓర్వకల్లు/కర్నూలు, మే 9(ఆంధ్రజ్యోతి): జమ్ము కశ్మీర్లో తెలుగు జవాన్ మురళీ నాయక్(23) వీరమరణం పొందారు. దేశ రక్షణకు సేవలందిస్తూ పాక్ జవాన్ల తూటాలకు బలయ్యారు. సరిహద్దుల్లో హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో ఆయన మృతిచెందినట్లు శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులకు ఆర్మీ క్యాంప్ అధికారులు సమాచారం అందించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లి తండాకు చెందిన మురళీ నాయక్ 2022 నవంబరులో అగ్నివీర్లో ఉద్యోగం సాధించి, నాసిక్లో శిక్షణ తీసుకున్నారు. అస్సాంలో విధుల్లో ఉంటున్న ఆయన్ను ఆపరేషన్ సిందూర్లో భాగంగా జమ్ముకశ్మీర్ సరిహద్దులకు పిలిపించారు. గురువారం అర్ధరాత్రి 12గంటల సమయంలో రాజౌరీ సెక్టార్లోని ఎల్వోసీ వద్ద పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. వారికి తగిన బుద్ధి చెప్పడానికి భారత్ కూడా ఎదురుకాల్పులు ప్రారంభించింది. యుద్ధ రంగంలో వీరోచితంగా పోరాడుతున్న మురళీ నాయక్కు పాక్ సైనికుల తూటాలు తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం విమానంలో ఢిల్లీకి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే వీరమరణం పొందినట్టు తెలిసింది. ఒక్కగానొక్క కూమారుడు ఇక లేడన్న విషయం తెలియగానే తల్లిదండ్రులు శోకసముద్రంలో ముగినిపోయారు. మురళీనాయక్ భౌతిక కాయాన్ని శనివారం కళ్లితండాకు తీసుకురానున్నారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంచనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
పేద కుటుంబం నుంచి..
గడ్డం తండా పంచాయతీ పరిధిలోని కళ్లితండాకు చెందిన శ్రీరామ్నాయక్, జ్యోతిబాయి దంపతులకు మురళీ నాయక్ ఒక్కరే సంతానం. వీరికి తండాలో ఒకటిన్నర ఎకరం పొలం ఉంది. వ్యవసాయ పనులు ఉన్నప్పుడు తండాలో ఉంటారు. ఆ తర్వాత ఉపాధి కోసం తల్లిదండ్రులు ముంబై వెళ్తుంటారు. అక్కడ శ్రీరామ్నాయక్ చిరువ్యాపారం చేసేవారు. తల్లి ఇళ్లలో పనిచేస్తారు. మురళికి మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి వీరు ముంబైకి వలస వెళుతున్నారు. దీంతో మురళీనాయక్ సోమందేపల్లి మండలం నాగినాయినిచెరువు తండాలో అమ్మమ్మ శాంతిబాయి, తాతయ్య నానేనాయక్ వద్ద ఉంటూ చదువుకున్నారు. అగ్నివీర్లో చేరాక ఏడాది క్రితం స్వగ్రామం కళ్లితండాకు వచ్చి, వారం రోజులు ఉన్నారు. తండాలో జాతర ఉండటంతో మురళి తల్లిదండ్రులు రెండు నెలల క్రితం ముంబై నుంచి స్వస్థలానికి తిరిగి వచ్చారు. కుమారుడికి ఫోన్ చేసి, జాతరకు రావాలని పిలిచారు. కానీ సెలవులు దొరకడం లేదని, రాలేనని చెప్పారు.
ఒక్కరోజైనా ఆర్మీలో..
అగ్నివీర్ శిక్షణకు వెళ్లే సమయంలో మురళీ నాయక్ను తల్లిదండ్రులు వారించారు. ఈ ఉద్యోగం వద్దని, మరొకటి చూసుకోవాలని వారు ఎంత చెప్పినా మురళి ఒప్పుకోలేదు. ‘ఒక్కరోజైనా ఆర్మీలో పనిచేయాలని ఉంది’ అని తన సంకల్పాన్ని తల్లిదండ్రులకు వివరించి, ఒప్పించాడని అతని స్నేహితులు రాజశేఖర్, బాలు, రాజ్కుమార్ గుర్తు చేసుకున్నారు.
మంత్రి సవితను తండాకు పంపిన సీఎం
అనంతపురం జిల్లా పర్యటనకు శుక్రవారం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, పుట్టపర్తి విమానాశ్రయంలో దిగిన వెంటనే మురళీ నాయక్ వీరమరణం గురించి తెలుసుకున్నారు. వెంటనే తండాకు వెళ్లి వీర జవాను కుటుంబానికి ధైర్యం చెప్పాలని మంత్రి సవితను ఆదేశించారు. దీంతో ఆమె కళ్లి తండాకు వెళ్లి మురళి తల్లిదండ్రులను ఓదార్చారు. ఆ కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందజేశారు. తీవ్ర భావోద్వేగానికిలోనైన మంత్రి.. కంట తడిపెట్టారు. మురళీ నాయక్ విగ్రహాన్ని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల సర్కిల్లో ఏర్పాటు చేస్తామని మంత్రి సవిత ప్రకటించారు.
ఫోన్లో జగన్ పరామర్శ
మురళీ నాయక్ తల్లిదండ్రులను మాజీ సీఎం జగన్ ఓదార్చారు. వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్ తండాకు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం జగన్కు ఫోన్చేసి వారితో మాట్లాడించారు. ‘మీ కుటుంబానికి దేశం, వైసీపీ, నేను అండగా ఉంటాం. అధైర్యపడవద్దు. త్వరలో వచ్చి మిమ్మల్ని కలుస్తా..’ అని వారితో జగన్ చెప్పారు.
దేశం కోసం..
తన ఒక్కగానొక్క కుమారుడు దేశం కోసం వీరమరణం పొందడం ఎంతో గర్వంగా ఉందని మురళీ నాయక్ తండ్రి శ్రీరామ నాయక్ అన్నారు. చిన్నప్పటి నుంచి ఆర్మీలో చేరాలని చెప్పేవాడని, ఆఖరికి దేశం కోసమే ప్రాణాలు అర్పించాడని అన్నారు. ‘జైహింద్... జై భారత్’ అని ఉద్వేగంగా అన్నారు.
రాత్రి గడిస్తే పునర్జన్మే..
మురళీ నాయక్ గురువారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్యలో తల్లిదండ్రులకు ఫోన్చేసి, క్షేమసమాచారాలు అడిగారు. తరువాత 9 గంటల సమయంలో స్నేహితుడు వినోద నాయక్కి ఫోన్ చేశారు. సరిహద్దుల్లో భీకర పోరు సాగుతోందని అక్కడి పరిస్థితిని వివరించారు. ‘నా గురించి భయం లేదు. కానీ అమ్మనాన్నలపైనే బెంగ. నాకు ఏదైనా జరగరానిది జరిగితే వారిని బాగా చూసుకో’ అని కోరారు. ఈ రాత్రి గట్టెక్కితే తనకు పునర్జన్మే అన్నాడని వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడి మరణవార్త విన్న తల్లి జ్యోతిబాయి సొమ్ముసిల్లి పడిపోయారు. స్పృహలోకి వచ్చిన తరువాత గుండెలవిసేలా రోదించారు.
పవన్ కల్యాణ్ నివాళులు
సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మరచిపోదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. యువ జవాన్ దేశ రక్షణకు అంకితమై, సమర భూమిలో అమరులయ్యారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మురళి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని పవన్ భరోసా ఇచ్చారు.
మీ ఆవేదన తీర్చలేనిది..: సీఎం
‘దే‘శం కోసం మీ బిడ్డ ప్రాణత్యాగం చేశారు. ఆ త్యాగం ఊరికే పోదు. మేమందరం మీ వెంట ఉంటాం. ధైర్యంగా ఉండండి’ అని మురళీనాయక్ తల్లిదండ్రులను సీఎం చంద్రబాబు ఫోన్లో ఓదార్చారు. ‘మీ ఆవేదన తీర్చలేనిది. అధైర్యపడవద్దు. దేశం మీ వెంట ఉంటుంది. మీ కుటుంబాన్ని అన్ని విధాలా అదుకుంటాం’ అని వారికి భరోసా ఇచ్చారు. కాగా, అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామంలో నిర్వహించిన ప్రజావేదికలో మురళీ నాయక్ ఆత్మశాంతి కోసం సీఎం రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతపురం జిల్లా పర్యటన అనంతరం తిరుగు ప్రయాణంలో భాగంగా సాయంత్రం సీఎం చంద్రబాబు కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరజవాను మురళీ నాయక్ చిత్రపటం ఎదుట పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక విమానంలో సీఎం అమరావతికి బయలుదేరి వెళ్లారు.
రాష్ట్రానికి గర్వకారణం: మంత్రి లోకేశ్
‘యుద్ధభూమిలో పాక్ సైనికులతో పోరాడుతూ మురళీనాయక్ వీర మరణం పొందారు. ఈ విషయం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. మురళీ నాయక్ చూపిన ధైర్యసాహసాలు రాష్ట్రానికే గర్వకారణం. ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తాం’ అని మంత్రి పేర్కొన్నారు. కాగా, దేశ రక్షణలో మురళి చూపిన ధైర్యసాహసాలు, పోరాట పటిమకు యూవత్ దేశం గర్విస్తోందని మంత్రి అచ్నెన్నాయుడు నివాళులు అర్పించారు. యువ జవాన్ పేరు చరిత్రపుటల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. కాగా, దేశ రక్షణ కోసం మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్
పాక్ దాడులపై ఎక్స్లో భారత ఆర్మీ పోస్ట్
For More AP News and Telugu New