AP High Court: టీటీడీ పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:22 PM
టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు జరిగాయి.
అమరావతి, డిసెంబరు16 (ఆంధ్రజ్యోతి): టీటీడీ పరకామణి చోరీ కేసుపై (TTD Parakamani Theft Case) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (AP High Court) ఇవాళ(మంగళవారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక సూచనలు చేసింది. తిరుమల శ్రీవారి పరకామణిలో జరిగే చోరీలను సాధారణ దొంగతనంగా చూడటానికి వీల్లేదని స్పష్టం చేసింది ఏపీ హైకోర్టు.
కానుకల రూపేణా వచ్చిన సొమ్ము చోరీకి గురయితే కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని హైకోర్టు తెలిపింది. పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను ఆధునీకీకరించాల్సిన అవసరముందని వెల్లడించింది. మానవ ప్రమేయాన్ని తగ్గించి.. యంత్రాలు, ఏఐ టెక్నాలజీని వినియోగించాలని తిరుమల తిరుపతి దేవస్థానానికి సూచించింది. టీటీడీలో ఇలాంటి చోరీ ఘటనలు జరుగుతున్నా కానుకలు లెక్కించేందుకు అదే పాత విధానాన్ని అనుసరించడం సరికాదని స్పష్టం చేసింది న్యాయస్థానం.
కానుకల లెక్కింపునకు సేవాభావంతో వచ్చిన భక్తులను దుస్తులు లేకుండా సోదాలు చేయడం, దొంగల్లా అవమానించడం తగదని పేర్కొంది. కానుకలు లెక్కింపునకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వినియోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో తగిన సూచనలు, సలహాలతో తమ ముందుకు రావాలని సూచించింది. ఈ క్రమంలోనే ఇరుపక్షాల న్యాయవాదులకు ఏపీ హైకోర్టు పలు సూచనలు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. ఆ సేవ రద్దుపై టీటీడీ కీలక ప్రకటన
సీఎంపై అభ్యంతరకర పోస్టు.. పోలీసుల అదుపులో వైసీపీ నేత
Read Latest AP News And Telugu News