Governor Nazeer on Women Leadership: మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
ABN , Publish Date - Sep 15 , 2025 | 03:01 PM
మహిళలకు రాజకీయ అవకాశాలు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళలకు అమలు కానున్న 33శాతం రిజర్వేషన్లు ఈ లోటును మారుస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
తిరుపతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మహిళా సాధికారత మహిళలకే పరిమితం కాదని.. సమాజం మొత్తానికి స్వేచ్ఛ, బలమైన ప్రజాస్వామిక సమాజాన్ని ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazeer) వ్యాఖ్యానించారు. ఇవాళ (సోమవారం) తిరుపతిలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సు రెండో రోజు కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు.
బాల్య వివాహాలు
సతి, బాల్య వివాహాలు వేదకాలంలో లేవని చెప్పుకొచ్చారు. మహిళలు గౌరవించబడిన చోట దైవత్వం వికసిస్తోందని చెప్పటం ద్వారా వేదకాలంలో మహిళలను ఎంతగా గౌరవించేవారో మనుస్మృతి స్పష్టం చేస్తోందని ఉద్ఘాటించారు. భారతదేశంలో మహిళల సమానత్వానికి మతం ఎంతో పెద్ద పాత్ర పోషించిందని నొక్కిచెప్పారు. ఒక కుటుంబంలో మహిళ ఆనందంగా ఉంటే... ఆ కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుందని... ఇదే దేశం మొత్తానికి వర్తిస్తోందని పేర్కొన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్.
మహిళలకు విద్యా అవకాశాలు..
‘వైదిక భారతదేశంలో మహిళలకు విద్యా అవకాశాలు అన్ని వర్గాలకు అందేవి. కవయిత్రి మొల్ల, సంస్కృతంలోని రామాయణాన్ని తెలుగులోకి అనువదించారు. రాజా రామ్ మోహన్ రాయ్ బాల్య వివాహాల రద్దు, వింతంతు పునర్వివాహ చట్టాలను తీసుకువచ్చారు. మార్పు మాత్రమే లోకంలో శాశ్వతమైనది. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారు. మహిళల రక్షణ హక్కుల కోసం అనేక తీర్పులు, అనేక చట్టాలను భారతదేశం చేసింది. అయితే మహిళలను రాజకీయంగా ముందుకు తీసుకుపోవటంలో ఇండియా వెనుకబడి ఉంది’ అని వెల్లడించారు గవర్నర్ అబ్దుల్ నజీర్.
మహిళలకు రాజకీయ అవకాశాలు..
‘మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించటంలో 193 దేశాల్లో 148వ ర్యాంకులో భారతదేశం ఉంది. మిజోరం వంటి రాష్ట్రాల్లో ఒక్క సభ్యురాలు కూడా అసెంబ్లీలో లేరు. మహిళలకు రాజకీయ అవకాశాలు ఉంటేనే అభివృద్ధి సాధ్యం. రాబోయే రోజుల్లో అమలు కానున్న మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఈ లోటును మారుస్తుంది. ఇది ప్రపంచానికి భారతదేశం గొప్పతనాన్ని చాటి చెప్పనుంది’ అని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు వాళ్లు అగ్రస్థానంలో ఉండాలన్నదే ఆలోచన: సీఎం
మెగా డీఎస్సీ ఫైనల్ లిస్ట్ విడుదల.. ఎంపికైన అభ్యర్థులకు లోకేశ్ అభినందనలు
For AP News And Telugu News