CM Chandrababu Instructions to Collectors: పాలనలో బాధ్యతగా పని చేయండి.. కలెక్టర్లకు సీఎం సూచనలు
ABN , Publish Date - Sep 15 , 2025 | 12:19 PM
కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయకపోతే ఫలితాలు రావని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సాంకేతికత పెరిగిన దృష్ట్యా స్మార్ట్ వర్క్ చేయాల్సిందేనని ఆదేశించారు. ఏఐ, డేటా లేక్ వంటి వాటి ద్వారా సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు.
అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : వాట్సాప్ గవర్నెన్స్ (WhatsApp Governance) ద్వారా పౌరసేవలు అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఇవాళ(సోమవారం) ఏపీ సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో అధికారులకు సీఎం చంద్రబాబు పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. పాలనలో మొదటి ఏడాది పరీక్షలు పూర్తి అయిపోయాయని చెప్పుకొచ్చారు. ఇంకా బాధ్యతగా పనిచేయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు సీఎం చంద్రబాబు.
ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయకపోతే ఫలితాలు రావని పేర్కొన్నారు. సాంకేతికత పెరిగిన దృష్ట్యా స్మార్ట్ వర్క్ చేయాల్సిందేనని ఆదేశించారు. ఏఐ, డేటా లేక్ వంటి వాటి ద్వారా సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు. పథకాలు, కార్యక్రమాల అమలు కోసం ఆర్టీజీఎస్ సేవలను ఉపయోగించుకోవాలని మార్గనిర్దేశం చేశారు. విజన్ రూపొందించి దానికి నిధులు కేటాయించకపోతే ఇబ్బందులు వస్తాయని చెప్పుకొచ్చారు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి సంక్షేమం అమలు చేస్తామని చెప్పామని.. అదే విధంగా సూపర్ సిక్స్ను సక్సెస్ చేశామని ఉద్ఘాటించారు. దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకంలో భాగంగా 64 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ ఇస్తున్నామని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.
సీఎం చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్య అంశాలు...
తల్లికి వందనం ద్వారా చదువుకునే ప్రతి విద్యార్థికి ఆర్థికసాయం చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఏడుగురు పిల్లలు ఉన్న తల్లికి కూడా ఈ పథకాన్ని వర్తింప చేశాం. ఆ కుటుంబాల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.
విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు వెళ్లే పరిస్థితులు వచ్చాయి.
ఉచిత బస్సు అమలు చేయలేమని కొందరు విమర్శించారు... కానీ స్త్రీశక్తి పథకం సఫలమైంది.
50 శాతం మహిళలను వంటింటికే పరిమితం చేస్తే వారి శక్తియుక్తులు వృథా అవుతున్నాయి.
పనిచేయగల వారిని సమర్థంగా వినియోగించుకుంటే జీఎస్డీపీ పెరుగుతుంది.
ఉచిత బస్సు ప్రయాణం - స్త్రీశక్తి పథకం ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పు తెస్తుంది.
ఈ పథకం అమలు తర్వాత 90 శాతం మేర ఆర్టీసీలో ఆక్యుపెన్సీ పెరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలుపుతున్నా.
దీపం - 2 పథకం ద్వారా.. ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
అన్నదాత సుఖీభవ ద్వారా మొదటి విడతలో రూ.7 వేలు ఇచ్చాం. మూడు విడతల్లో రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఆటో డ్రైవర్లకు కూడా రూ.15 వేలను అక్టోబరు 1 తేదీన ఇస్తాం.
పీపీపీ విధానంలో పోర్టులు, ఇన్ఫ్రా పెరిగింది.
ఆర్థిక అసమానతలు పెరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిదీ.
సమాజంలోని అన్ని ప్రాంతాల్లోనూ అవకాశాలు రావాలి... ప్రతిఫలాలు అందాలి.
గతంలో రాయలసీమ అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే ప్రాంతం.. ఇప్పుడు కోనసీమతో సమానంగా ఉంది.
ప్రపంచంలోని నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయుడైతే.. అందులో ఏపీ వాళ్లే ఎక్కువ ఉన్నారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ లాంటి విధానాలతో సమర్థనీటి నిర్వహణ ద్వారా మంచి ఫలితాలు సాధించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
పట్టిసీమతో డెల్టాలో వాడే కృష్ణానీటిని పొదుపు చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగాం.
ప్రస్తుతం హంద్రీనీవా ప్రధాన కాలువను వంద రోజుల్లో పూర్తి చేసి కుప్పం వరకూ కృష్ణా నీళ్లు తీసుకెళ్లాం.
గోదావరిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృథాగా పోతున్నాయి. సమర్థ నీటి నిర్వహణతో రిజర్వాయర్లు నింపాం.
వాణిజ్య పంటల విషయంలోనూ సరైన సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభం వచ్చేలా చేయాలి.
కలెక్టర్లు బ్యూరోక్రాటిక్గా కాకుండా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుని పాలసీలు అమలు చేయాలి.
ఐదేళ్లలో 25 కలెక్టర్ల కాన్ఫరెన్సులు, 125 కేబినెట్ సమావేశాలు, ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహిస్తాం.
ప్రభుత్వం అందించే సేవలన్నిటిలోనూ సంతృప్త స్థాయే కొలమానం అవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు వాళ్లు అగ్రస్థానంలో ఉండాలన్నదే ఆలోచన: సీఎం
మెగా డీఎస్సీ ఫైనల్ లిస్ట్ విడుదల.. ఎంపికైన అభ్యర్థులకు లోకేశ్ అభినందనలు
For AP News And Telugu News