Share News

Chandrababu: పింఛన్‌దారులకు జగన్ నమ్మక ద్రోహం చేస్తున్నారు.. చంద్రబాబు ఫైర్

ABN , Publish Date - Apr 02 , 2024 | 09:32 PM

ఏపీలో పెన్షన్ల పంపిణీ విషయంలో సీఎం జగన్ (CM Jagan) కుట్రలను, వాస్తవాలను ప్రజలంతా తెలుసుకోవాలని కోరుతూ తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu) బహిరంగ లేఖ రాశారు. సామాజిక పింఛన్ల పంపిణీ అనేది ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు.

 Chandrababu: పింఛన్‌దారులకు జగన్  నమ్మక ద్రోహం చేస్తున్నారు.. చంద్రబాబు ఫైర్

అమరావతి: ఏపీలో పెన్షన్ల పంపిణీ విషయంలో సీఎం జగన్ (CM Jagan) కుట్రలను, వాస్తవాలను ప్రజలంతా తెలుసుకోవాలని కోరుతూ తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Chandra babu Naidu) మంగళవారం నాడు బహిరంగ లేఖ రాశారు. సామాజిక పింఛన్ల పంపిణీ అనేది ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ఆ బాధ్యతను సీఎం జగన్‌ రెడ్డి సక్రమంగా నిర్వహించకుండా, దురుద్దేశంతో వయోవృద్ధులు, దివ్యాంగులను అవస్థలపాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వార్ధ ప్రయోజనాల కోసం ఎప్పుడూ లేని విధంగా, ఎన్నికల ముందు పింఛన్ల పంపిణీపై కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఈ బహిరంగ లేఖ రాసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో వలంటీర్లతో నగదు పంపిణీ చేసే బాధ్యతల నుంచి ఎన్నికల కమిషన్‌ తప్పించిందని గుర్తుచేశారు.

AP Election 2024: భారత ఎన్నికల సంఘానికి నారా చంద్రబాబు నాయుడు లేఖ

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇళ్ల వద్దకే పింఛన్లు అందించాలని ఎన్నికల కమిషన్‌ చెప్పిందని.. కానీ, ఈ పరిణామాన్ని వైసీపీ కుట్రలు, కుతంత్రాలకు ఉపయోగించుకుంటున్న విధానాన్ని రాష్ట్ర ప్రజలు, లబ్ధిదారులు అర్థం చేసుకోవాలని అన్నారు. గతేడాది 2022 ఏప్రిల్‌ 1వ తేదీకి ముందే పింఛన్ల నిధులు బ్యాంకుల నుంచి విత్‌ డ్రా చేసి 1వ తేదీన పంపిణీ చేశారని చెప్పారు. ఈ ఏడాది కూడా ముందే బ్యాంకుల నుంచి విత్‌ డ్రా చేసి ఉంటే ఎలాంటి ఇబ్బందీ ఎదురయ్యేది కాదన్నారు. మార్చి 16వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ మధ్య 15 రోజుల్లోనే సొంత కాంట్రాక్టర్లకు రూ.13 వేల కోట్లను జగన్‌ ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. పింఛన్‌ దారులకు ఇవ్వాల్సిన రూ.2వేల కోట్లు కూడా సొంత కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఖజానా ఖాళీ చేశారని మండిపడ్డారు.


అందువల్లే పింఛన్ల పంపిణీలో జాప్యం

నిధుల కొరత వల్లే పింఛన్ల పంపిణీ జాప్యం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఖజానాలో పింఛన్ల పంపిణీకి సరిపడా నిధులుంటే ఏప్రిల్‌ 1వ తేదీకి ముందే బ్యాంకుల నుంచి నిధులు విత్‌ డ్రా చేసి ఉండేవారు కదా! అని ప్రశ్నించారు. ఇళ్ల వద్దే పింఛన్‌ ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలను జగన్‌ లెక్క చేయకుండా.. మండుటెండల్లో పింఛన్‌ దారులను కష్టపెట్టి, ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. తన రాజకీయ లబ్ధి కోసం అవ్వాతాతలను, దివ్యాంగులను జగన్‌రెడ్డి కష్టపెట్టేలా కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత ఎన్నికల సమయంలో బాబాయి వివేకానందారెడ్డి హత్యను జగన్‌రెడ్డి రాజకీయ లబ్ధికి వాడుకున్నారని.. ‘నారాసుర రక్త చరిత్ర’ అని తనపై నిందలేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నేడు పింఛన్ల పంపిణీ విషయంలో జగన్నాటకం ఆడుతూ పింఛన్‌దారులకు నమ్మక ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని లబ్ధిదారులు, ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు కోరారు.

AP Election 2024: అభ్యర్థులను ప్రకటించిన ఏపీ కాంగ్రెస్.. వైఎస్ షర్మిల పోటీ చేసేది ఎక్కడి నుంచంటే?

ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పింఛన్ల పంపిణీకి ఎప్పటిలాగే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమని ఎన్నికల కమిషన్‌ సూచించిందన్నారు. అందుబాటులో ఉన్న 1.35 లక్షల సచివాలయ సిబ్బంది ద్వారా ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదు? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని బట్టి పింఛన్‌ దారులపై జగన్‌ రెడ్డి చూపుతున్నది కపట ప్రేమ, మొసలి కన్నీరని స్పష్టమవుతోందన్నారు. ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి పింఛన్లు ఇళ్ల వద్ద కాకుండా సచివాలయాల్లో పంపిణీ చేస్తామని సెర్ప్‌ సీఈఓ మురళీధర్‌ రెడ్డి మార్చి 28వ తేదీన ఇచ్చిన పత్రికా ప్రకటన సీఎం అనుమతి లేకుండా ఇస్తే, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని చంద్రబాబు నిలదీశారు.

AP Govt: పెన్షన్ల పంపిణీపై మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం


సీఎస్ జవహర్‌ రెడ్డికి ఎందుకు ఆదేశాలివ్వలేదు..?

ఇంటి వద్దే పింఛన్‌ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రిగా చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డికి ఎందుకు ఆదేశాలివ్వలేదు? అని ప్రశ్నించారు. తెలుగుదేశంపై నెపం నెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అవ్వా తాతలను అవస్థలపాలు చేయడం దుర్మార్గం కాదా? అని నిలదీశారు. తగిన సిబ్బంది లేనందున గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తించడం కష్టమని, అందరికీ ఇంటి వద్ద పింఛన్‌ ఇవ్వలేమని ప్రభుత్వం కుంటి సాకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 1.35 లక్షల మంది సచివాలయ సిబ్బంది, మరోవైపు రెవెన్యూ, సెర్ప్‌, మెప్మా, పంచాయతీరాజ్‌ సిబ్బంది కూడా ఉన్నారని వారిని వినియోగించుకోని పింఛన్లు సకాలంలో అందేలా చూడాలని చంద్రబాబు కోరారు.

వీరందరి సహకారంతో ఒక్క రోజులోనే అందరికీ పింఛన్‌ అందించే వెసులుబాటు ఉందని .. కానీ జగన్‌ ప్రభుత్వం కుంటి సాకులు చెప్పడం కేవలం రాజకీయ కుట్ర తప్ప మరేమీ లేదనేది సుస్పష్టం అవుతోందన్నారు. ఇది కేవలం రాజకీయ కుట్ర అని ప్రజలంతా అర్థం చేసుకోవాలని అన్నారు. దివ్యాంగులు, వృద్ధులు, రోగులకు మాత్రమే ఇళ్ల వద్ద పింఛన్లు ఇస్తామని, మిగిలిన వారికి సచివాలయాల వద్ద ఇస్తామంటూ సర్క్యులర్‌ ఇవ్వడం దుర్మార్గమని మండిపడ్డారు. పింఛన్ల పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి జగన్ కుట్రలకు, నాటకాలకు తెరదించి లబ్ధిదారులందరికీ ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రజల తరఫున చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

AP Debt: ఏపీ నెత్తిన మరో బండ.. ఆర్బీఐ నుంచి వేల కోట్ల అప్పు

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 09:59 PM