Mamata Banerjee: టార్గెట్ 2024.. హస్తినకు మమత..

ABN , First Publish Date - 2023-03-15T19:37:24+05:30 IST

2024 లోక్‌సభ ఎన్నికలే(2024 Lok Sabha elections) లక్ష్యంగా మమత పావులు కదపనున్నారు.

Mamata Banerjee: టార్గెట్ 2024.. హస్తినకు మమత..
Mamata Banerjee Delhi Tour

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి(TMC), పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) హస్తినకు రాబోతున్నారు. ఈ నెలాఖరులో ఆమె ఢిల్లీలో పర్యటిస్తారని టీఎంసీ వర్గాలు తెలిపాయి. 2024 లోక్‌సభ ఎన్నికలే(2024 Lok Sabha elections) లక్ష్యంగా ఆమె పావులు కదపనున్నారు. ప్రతిపక్ష నేతలను కలిసి భవిష్యత్‌లో కలిసి చేపట్టాల్సిన అంశాలపై వ్యూహరచన చేయనున్నారు.

ఢిల్లీ టూర్‌లో భాగంగా మమత ప్రతిపక్షనేతలను కలిసినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మాత్రం కలవబోరని ప్రచారం జరుగుతోంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఆమె కలవబోరని తెలుస్తోంది. కాంగ్రెసేతర ఫ్రంట్‌పైనే మమత మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెసేతర, బీజేపీయేతర పక్షంగా ఉన్నారు. కాంగ్రెసేతర పక్షంవైపే మమత మొగ్గడానికి ఓ కారణం ఉంది. అది కూడా ఇటీవలి ఉప ఎన్నికల్లో జరిగిందే.

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పశ్చిమబెంగాల్‌లోని సాగర్దిగి(Sagardighi) అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్ధిని కాంగ్రెస్ (Congress) పార్టీ ఓడించింది. తృణమూల్ అభ్యర్ధి దేబాశీష్ బెనర్జీని కాంగ్రెస్ బేరోన్ బిశ్వాస్ చిత్తుగా ఓడించారు. కాంగ్రెస్-సీపీఎం-బీజేపీ(Bharatiya Janata Party) అనైతిక పొత్తు వల్లే కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపొందారని మమత ఆరోపించారు. బీజేపీ(BJP) ఓట్లన్నీ కాంగ్రెస్ అభ్యర్ధికి పడేలా కుట్ర చేశారని దీదీ ఆరోపించారు. సాగర్దిగి తమ పార్టీ అభ్యర్థి ఓటమితో షాక్‌లో పడిపోయిన దీదీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో(2024 Lok Sabha elections) ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోబోమని ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. తద్వారా కాంగ్రెస్ పార్టీకి దీదీ అతి పెద్ద షాకిచ్చారు. తాము కాంగ్రెస్‌తో చేతులు కలిపేదే లేదన్నారు.

ఢిల్లీ టూర్‌లో భాగంగా మమత బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(KCR)ను, నేషనల్ కాన్ఫరెన్స్(NC) అధినేత ఫరూఖ్ అబ్దుల్లాను, ఎన్సీపీ(NCP) అధినేత శరద్ పవార్‌ను, శివసేన ఉద్ధవ్ వర్గం అధినేత ఉద్ధవ్ థాకరేను, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత(AAP), ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను, ఆర్జేడీ(RJD) అధినేత తేజస్వీయాదవ్‌ను, సమాజ్‌వాదీ పార్టీ(SP) చీఫ్ అఖిలేష్ యాదవ్‌ను కలుసుకుంటారని ప్రచారం జరుగుతోంది. వీరంతా దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi)కి లేఖ రాసిన నేతలే. అయితే జేడిఎస్, జేడియూ, సీపీఎం నేతలెవ్వరూ ఆ లేఖలో సంతకాలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీని కాదని మిగతా రాజకీయ పార్టీలను ఒకేతాటిపైకి తీసుకువచ్చేందుకు మమత యత్నించనున్నారు. కాంగ్రెస్‌తో ఒరిగేదేమీ లేదని దీదీ అభిప్రాయపడుతున్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో(2024 Lok Sabha elections) ఒంటరిగా వెళ్తామంటూ మమత చేసిన ప్రకటన కాంగ్రెస్‌కు శరాఘాతంగా మారే అవకాశం ఉంది. అదే సమయంలో బీజేపీకి మేలు చేసే అవకాశం కూడా ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో(2019) బీజేపీ 18 లోక్‌సభ స్థానాలు గెలుచుకుని తృణమూల్‌కు గట్టి సవాల్ విసిరింది. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలు కూటమిగా నిలవకపోతే కమలనాథుల హవాను అడ్డుకోవడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్, తృణమూల్, వామపక్షాలు వేర్వేరుగా పోటీచేస్తే బీజేపీకి మేలు జరిగే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2023-03-15T19:40:27+05:30 IST