అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ మిలటరీ కమాండ్ తాజా హెచ్చరికలు చేసింది. ఇంతవరకూ ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరుపుతున్న తమ దళాలు పశ్చిమాసియాలోని అమెరికా, ఇజ్రాయెల్కు సంబంధించిన ఆర్థిక, బ్యాంకింగ్ కేంద్రాలను టార్గెట్ చేయనున్నట్టు హెచ్చరించింది.
ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఖమేనీ వారసుడిగా, ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్గా పదవీ బాధ్యతలు స్వీకరించినట్టు వార్తలు వస్తున్నాయి.
అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా భీకర దాడులు చేపట్టింది. హర్మూజ్ జలసంధి సమీపంలో 16 ఇరానియన్ మైన్లేయర్లను అమెరికా సైన్యం ధ్వంసం చేసింది అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులతో సతమతమవుతున్న ఇరాన్ వాసులను మరోవైపు నల్లటి ఆమ్ల వర్షం ఆందోళనకు గురి చేస్తోంది. చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులు చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్లోని పలు ప్రాంతాల్లో నల్లటి ఆమ్ల వర్షం కురిసినట్టు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి.
టెహ్రాన్లో ఇంధన నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇది యుద్ధమా? ప్రళయమా? అంటూ జనాలు నివ్వెరపోయేలా చేస్తున్నాయి.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ ఇరాన్ను మరోసారి హెచ్చరించారు. ఇరాన్ కోసం మరిన్ని సర్ప్రైజ్లు ఎదురు చూస్తున్నాయని అన్నారు. అక్కడి నిరంకుశ పాలన అంతమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు కూడా ఇజ్రాయెల్ వాయుసేన జరిపిన తొలి దాడుల్లో గాయపడినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 26వ తేదీన ఇరాన్పై ఆపరేషన్ లయన్స్ రోర్ పేరుతో ఇజ్రాయెల్ వాయుసేన దాడులకు దిగిన సంగతి తెలిసిందే.
ఇరాన్ తన శత్రుదేశం అమెరికాకు ఊహించని షాక్ ఇచ్చింది. జోర్డాన్లోని అత్యంత ఖరీదైన రాడార్ సిస్టమ్ను ధ్వంసం చేసింది. యుద్ధం మొదలైన తొలి రోజుల్లోనే ఇరాన్ దాడుల్లో ఏఎన్ టీపీవై 2 రాడార్ అండ్ సపోర్ట్ ఎక్యుప్మెంట్ ధ్వంసం అయింది.
మధ్య ప్రాచ్యంలో యుద్ధం మరో రెండు, మూడు వారాల పాటు ఇలాగే కొనసాగితే ముడి చమురు బ్యారెల్ ధర 150 డాలర్లకు ఎగబాకుతుందని ఖతర్ ఇంధన శాఖ మంత్రి తాజాగా హెచ్చరించారు.
కువైట్ సమీప సముద్రంలో ఆయిల్ ట్యాంకర్లో భారీ పేలుడు సంభవించింది. ముబారక్ అల్-కబీర్ పోర్టుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు యూకే మెరైన్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అధికారులు వెల్లడించారు.