అనుబంధానికి ‘రక్ష’
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:05 PM
అన్నాచెల్లెల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ వచ్చింది. శుక్రవారం అక్కాతమ్ముళ్లు ఆనందోత్సవాల మధ్య పండుగను జరుపుకోనున్నారు.
సోదరీ సోదరుల ఆత్మీయతకు ప్రతీక రక్షాబంధన్
పుట్టింటికి చేరుకుంటున్న ఆడపడుచులు
రేపు రాఖీ పండుగ
మహబూబాబాద్: అన్నాచెల్లెల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ వచ్చింది. శుక్రవారం అక్కాతమ్ముళ్లు ఆనందోత్సవాల మధ్య పండుగను జరుపుకోనున్నారు. ఈ రాఖీ పర్వదినంపై నాటి నుంచి నేటి వరకు అనేక పురాణాలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. సోదరుడికి కట్టే రాఖీలు సోదరీమణులకు ఎంతో రక్షణ కవచంగా నిలుస్తాయని విశ్వాసం. మార్కెట్లో రుద్రాక్ష, స్టోన్, వెండి, బంగారు రాఖీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కుందన్లు, మెరుపులు జరీతో పాటు స్పాంజితో తయారు చేసిన రాఖీలు మార్కెట్లోకి వచ్చాయి. పిల్లలను ఆకర్షించేందుకు కార్టున్ రాఖీలు కూడా వచ్చాయి.
పాతకాలంలో అతిపెద్దగా ఉండే రాఖీలు ధరించేవారు. రానురాను అవి చిన్నగా మారిపోయాయి. మళ్లీ ఈ సంవత్సరం మార్కెట్లోకి పెద్దపెద్ద రాఖీలు దుకాణాల్లో దర్శనిమిచ్చాయి. దూరప్రాంతాల్లో ఉన్న సోదరులకు సోదరీమణులు కొరియర్, పోస్టు ద్వారా ముందుగానే రాఖీలు పంపించారు. కాగా, ఒక్క రూపాయి నుంచి మొదలుకుని రూ.1000 వరకు రాఖీ ధరలు పలుకుతున్నాయి.
హిందూ పండుగల్లో ఒకటి..
హిందువులు జరుపుకునే పండుగల్లో రాఖీ ఒకటి. ఈ వేడుక సోదర, సోదరీమణులకు మధ్య ప్రేమకు గుర్తుగా పేరుగాంచింది. రాఖీ కట్టిన తన సోదరికి సోదరుడు తన జీవితాంతం అండగా ఉంటానని మాట ఇస్తాడు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుపై రాఖీకట్టి స్వీటు తినిపించి, హారతినిస్తారు. తనకు రాఖీ కట్టిన సోదరికి ఏదైనా చిరుకానుక బహుమతిగా ఇచ్చి జీవితాంతం కాపాడతానని హామీ ఇచ్చినట్లుగా భావిస్తారు. ఈ పండుగ ప్రతీ సంవత్సరం శ్రావణమాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. రక్షాబంధన్ అనే పదం రక్ష, బంధన్ అనే రెండు పదాలతో ఏర్పడింది. దేవతామూర్తుల కాలం నుంచి ఈ పండుగను జరుపుకుంటున్నట్లుగా చరిత్ర ద్వారా తెలుస్తోంది.
ఎందుకు జరుపుకుంటారంటే..
ఒకరోజు శ్రీగణేశుడు తన సోదరి మానసదేవితో రాఖీ కట్టించుకుంటుండగా అప్పుడు ఇద్దరు కుమారులు శుభ్, లాబ్లు ఇది ఏంటని అడిగారట. అప్పుడు గణేశుడు ఇది రక్షణ కవచం అని, ఈ రక్షాసూత్రం సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు ప్రతీక అని చెప్పాడట. ఇది విన్న శుభ్, లాభ్లు తమకి కూడా ఒక సోదరి కావాలని పట్టుబట్టగా తన కుమారుల కోరిక మేరకు గణేశుడు తన శక్తుల నుంచి ఒక మంటను సృష్టించి, దానిని తన భార్యలు సిద్ధి, బుద్ధిల ఇద్దరి ఆత్మశక్తితో కలిపి ఆ వెలుగు నుంచి ఒక అమ్మాయి జన్మించింది. ఆ అమ్మాయికే సంతోషిమాత అని పేరు పెట్టారట!
28న పండుగ ఇలా..
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆడపడుచులు ఈ ఏడాది రాఖీ పర్వదినాన్ని సుఖఃసంతోషాలతో జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. 27వ తేదీ నాటికే పుట్టింటికి చేరుకునేందుకు తరలివస్తున్నారు. రాఖీ పర్వదినాన్ని రాఖీ పౌర్ణమి, శ్రావణపౌర్ణమి, జంజాల పౌర్ణమి కూడా పిలుస్తారు. 28న పౌర్ణమి తిథి కాబట్టి ఈ రోజే రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని వేద పండితులు, అర్చకులు చెబుతున్నారు. రేపు రాఖీ పర్వదినాన్ని జరుపుకోవచ్చనే పండితుల సూచనల మేరకు ఆడపడుచులు రాఖీలు, స్వీట్లతో పుట్టింటికి చేరుకుంటున్నారు. ఈనెల 28న సూర్యోదయం నుంచి సూర్యస్తమయం వరకు సోదరులకు సోదరీమణులు రాఖీలు కట్టుకోవచ్చని వేద పండితులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కాచిగూడ-అశోకాపురం ఎక్స్ప్రెస్ రైలు సమయంలో మార్పులేదు
ఇందిరమ్మ ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు
Read Latest AP News And Telangana News And International News And Telugu News