న్యూజిలాండ్లో భారత్ టూర్కు భారీ క్రేజ్..రికార్డు స్థాయిలో టికెట్ల విక్రయం!
ABN , Publish Date - Aug 27 , 2026 | 11:22 AM
న్యూజిలాండ్లో టీమిండియా పర్యటనకు ఇప్పటినుంచే భారీ క్రేజ్ కనిపిస్తోంది. న్యూజిలాండ్ క్రికెట్ అంతర్జాతీయ సీజన్ టికెట్ల విక్రయాలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి.
స్పోర్ట్స్ డెస్క్: ఈ ఏడాది అక్టోబర్లో టీమిండియా న్యూజిలాండ్లో పర్యటించనుంది. టీ20, వన్డే, టెస్టు సిరీసుల్లో భాగంగా మొత్తం 12 మ్యాచులు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటినుంచే భారీ క్రేజ్ కనిపిస్తోంది. న్యూజిలాండ్ క్రికెట్ అంతర్జాతీయ సీజన్ టికెట్ విక్రయాలు రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యాయి. క్రికెట్ నేషన్ సభ్యుల ప్రీ సేల్ మొదలైన 48 గంటల్లోనే 26 వేల టికెట్లు అమ్ముడయ్యాయి.
ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్లో జరిగే పరిమిత ఓవర్ల మ్యాచ్లకు టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. క్రైస్ట్చర్చ్లోని 9 వేల సీట్ల హాగ్లీ ఓవల్కు టికెట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుత డిమాండ్ ప్రకారం చూస్తే.. అక్టోబర్ 22, 24 తేదీల్లో జరిగే తొలి రెండు టీ20లకు ఈ స్టేడియం పూర్తిగా నిండిపోయే అవకాశం ఉంది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు జరిగే రెండో టెస్టుకు కూడా భారీ స్పందన వస్తోంది.
వెల్లింగ్టన్ వేదికగా జరిగే మ్యాచుల టికెట్లకు డిమాండ్ పెరిగింది. భారత పర్యటనపై క్రికెట్ అభిమానుల్లో ఉన్న ఉత్సాహమే రికార్డు విక్రయాలకు కారణమని న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ మార్కెటింగ్ అండ్ కమర్షియల్ ఆఫీసర్ గ్లెన్ క్రిచ్లీ తెలిపారు. గత సీజన్లో ఉన్న ధరలనే కొనసాగించామని ఆయన వెల్లడించారు.క్రికెట్ నేషన్లో సభ్యత్వం తీసుకున్న వారు ముందస్తు విక్రయాల్లో పాల్గొనవచ్చు. వారికి టికెట్లపై 15 శాతం రాయితీ లభిస్తుంది. సెప్టెంబర్ 7 నుంచి సాధారణ టికెట్ విక్రయాలు ప్రారంభమవుతాయి.
ఇవి కూడా చదవండి:
నోబాల్స్ తగ్గాలంటే.. టెస్టుల్లో ఫ్రీ హిట్ పెట్టాలి: టీమిండియా కోచ్