పాకాల పిలుస్తోంది..
ABN , Publish Date - Jun 24 , 2026 | 10:39 AM
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సుందరమైన పర్యాటక ప్రదేశం పాకాల.
ఆధునిక హంగులతో కొత్త రూపు
సంతరించుకున్న టూరిజం స్పాట్
పిల్లలు, పెద్దలు ఉల్లాసంగా గడిపేలా ఏర్పాట్లు
ఆకట్టుకుంటున్న బయోడైవర్సిటీ పార్కు
సరస్సులో హాయి హాయిగా బోటు షికారు
ప్రకృతిలో సేదతీరేందుకు నైట్ క్యాంపింగ్
ఉత్తేజభరితం ట్రెక్కింగ్, నేచర్వాక్
పార్టీలు, ఫంక్షన్లకు ప్రత్యేక ప్యాకేజీలు
ఖానాపురం(వరంగల్): ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సుందరమైన పర్యాటక ప్రదేశం పాకాల. సహజ సిద్ధ అందాలకు ఇప్పుడు ఆధునిక హంగులు కల్పించడంతో మరింత శోభను సంతరించుకుంది. నిత్యం రాష్ట్ర నలుమూలల నుంచి వందలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వారు చూడాల్సిన ప్రదేశాలు.. ఎక్కడ బస చేయాలి.. ఇలా పాకాల ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ఎక్కడ ఏ చార్జీలు చెల్లించాలో పూర్తి సమాచారం పర్యాటకుల కోసం..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 205 కి.మీ. దూరంలో పాకాల సరస్సు ఉంటుంది. హైదరాబాద్ నుంచి రైళ్లలో వచ్చే పర్యాటకులు వరంగల్లో దిగి అక్కడి నుంచి బస్సు మార్గంలో రావాలి. వరంగల్కు 58 కి.మీ. దూరంలో పాకాల ఉంటుంది. అయితే ఎక్కువశాతం ప్రైవేట్ వాహనాల్లో వస్తుంటారు.
పాకాల బయోడైవర్సిటీ పార్కు ఎంట్రీ గేటు నుంచి కట్టపైకి వెళ్లాలి. ఎంట్రీ ఫీజు పెద్దలకు ఒక్కొక్కరికి రు.50, చిన్నారులకు రు.30 చెల్లించాలి. ప్లాస్టిక్ వస్తువులను లోనికి తీసుకెళ్లరాదు. అదేవిధంగా పాకాల కట్టపైకి ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదు. కట్టపైకి వెళ్లేందుకు బ్యాటరీ వాహనాలు ఉంటాయి. ఒక్కో పర్యాటకుడు రు.10 చెల్లించి అందులోనే వెళ్లాలి. ఆటో ఎంగేజ్ తీసుకుంటే అరగంటకు రు.400 చెల్లించాల్సి ఉంటుంది. సరస్సులో బోటు షికారు ఉంటుంది. రెండు రకాల బోట్లు ఏర్పాటు చేశారు. స్పీడ్ బోటులో ప్రయాణానికి రు.400, పెద్ద బోటులోనైతే రు.50 చెల్లించాల్సి ఉంటుంది.
పాకాల కట్ట దిగువన చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేశారు. అక్కడ చిన్నారులు ఆడుకోవడానికి ప్రాంఫోలిన్, జంపింగ్, రోప్ టైర్స్, టైర్ నెట్ వంటి వివిధ రకాల ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరికి రు.50 చెల్లించి 20 నిమిషాల పాటు ఆడుకోవచ్చు. అక్కడే ఏర్పాటు చేసిన ఫూల్లో ఫెడల్ బోటులో విహరించడానికి 10 నిమిషాలకు రూ.50, అదేవిధంగా చార్జింగ్ బాల్లో ఐతే 10 నిమిషాలకు రు.100 చెల్లించాల్సి ఉంటుంది. ఇది పర్యాటకులకు తీయని అనుభూతిని ఇస్తుంది. బట్టర్ఫ్లై గార్డెన్లోకి ఉచిత ప్రవేశం ఉంటుంది. అక్కడ రంగురంగుల సీతాకోక చిలుకలను చూస్తూ గడిపేయవచ్చు. సెల్ఫీలు దిగవచ్చు.
సఫారీ టూర్
పాకాల అడవుల్లోని పక్షులు, వన్య మృగాలను వివిధ రకాల వృక్షాలను చూస్తూ ఎంజాయ్ చేయడానికి సఫారీ టూర్ను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక్కొక్కరికి రు. 250 చెల్లించాల్సి ఉంటుంది. బయో డైవర్సిటీ పార్కు నుంచి పాకాల అడవుల్లో 9 కి.మీ. వరకు సఫారీ వాహనంలో తీసుకెళ్లి మధ్య మధ్యలో వాచ్టవర్ల నుంచి బైనాక్యులర్లతో పక్షులు, అటవీ జంతువులను వీక్షించవచ్చు. వారి వెంట గైడ్ ఉండి పక్షులు, జంతువులు, వృక్షాల గురించి పర్యాటకులకు వివరిస్తారు. దీంతో దట్టమైన అడవులను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కలుగుతుంది. అలాగే పాకాలలో సైకిల్ సవారి సైతం ఉంది. గంటకు రూ.20 చెల్లించి ఎంచక్కా సైకిల్ రైడ్ చేసుకోవచ్చు.
వీటితో పాటు పాకాలకు వచ్చే పర్యాటకులు పార్టీలు, ఫంక్షన్లు చేసుకోవడానికి కట్ట దిగువన గణపతిదేవ వన మండపం నిర్మించారు. ఇందులో 20 మందికి రూ.5వేలు, 50 మందికి రూ.10 వేలు, 150 మందికి రూ.15 వేలు చెల్లించి పార్టీ జరుపుకోవచ్చు. అంతేకాకుండా ఫొటో షూట్కు రూ.600, వీడియో షూట్కు రూ. 2,500, డ్రోన్ ఘాట్కు రూ. 3 వేలు చెల్లించి పాకాల అందాలతో మమేకం కావచ్చు. సుదూర ప్రాంతాల నుంచి పాకాలకు వచ్చే పర్యాటకులకు పచ్చని చెట్ల మధ్య గడపడం మధురానుభూతిని మిగుల్చుతుంది.
నైట్ క్యాంపింగ్...
పాకాలకు వచ్చే పర్యాటకులు నైట్ క్యాంపింగ్తో ప్రకృతిలో సేదతీరే అవకాశం లభిస్తుంది. నైట్ క్యాపింగ్ను ప్రస్తుతం ప్రైవేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. నైట్ క్యాంపింగ్కి వచ్చే పర్యాటకులు ఒక్కరికి రు.1999 చెల్లించాల్సి ఉంటుంది. వీరు సాయంత్రం 4 గంటలకు పాకాలకు చేరుకోవాల్సి ఉంటుంది. వీరికి సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నర్ ఏర్పాటు చేస్తారు. రాత్రివేళ ఫైర్ క్యాంప్ ఏర్పాటు ఉంటుంది. రాత్రికి టెంటెడ్ అకామిడేషన్లో బస చేయాల్సి ఉంటుంది. ఉదయం 5 గంటలకే పాకాల అడవుల్లో ట్రెక్కింగ్, నేచర్వాక్ ఉంటుంది. ఉదయం అల్ఫాహారం ఇస్తారు. పాకాల సరస్సులో బోటింగ్తో టూర్ ముగుస్తుంది. నైట్ క్యాంపింగ్ కోసం పర్యాటకులు ముందస్తుగా 8333852527 నంబరుకు ఫోన్ చేసి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
బాసర మహంకాళి ఆలయ చోరీ.. హోంగార్డుల సరెండర్
కన్న కొడుకు దాడి.. పోలీసులను ఆశ్రయించిన తండ్రి
Read Latest AP News And Telangana News And International News And Telugu News