నెల్లూరు ఏఎస్పేట దర్గా వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలపై వక్ఫ్ బోర్డు చైర్మన్ రియాక్షన్
ABN , Publish Date - Jun 24 , 2026 | 08:55 AM
నెల్లూరు జిల్లాలోని ఏఎస్పేట దర్గా విసయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలపై వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ స్పందించారు. ఏఎస్పేట దర్గా వ్యవహారంలో వక్ఫ్ బోర్డు పూర్తి నిఘా పెట్టిందని అబ్దుల్ అజీజ్ తెలిపారు.
నెల్లూరు, జూన్, 24 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలోని ఏఎస్పేట దర్గాలో (Nellore AS Pet Dargah) పలు కేసుల్లో నిందితులుగా ఉన్నవారికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు (Pawan Kalyan) ఫిర్యాదులు అందాయి. ఈ విషయంపై పవన్ కల్యాణ్ స్పందించి.. వక్ఫ్ బోర్డుకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలపై రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ (Abdul Aziz) స్పందిస్తూ కీలక వివరాలను వెల్లడించారు.
2023లో ముత్తవల్లిని తొలగించారు..
ఏఎస్పేట దర్గా నిర్వహణలో ముత్తవల్లి, సజ్జాదే నషీద్ బాధ్యులుగా ఉన్నారని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఇందులో ముత్తవల్లి ఏకంగా వక్ఫ్ బోర్డుపైనే 33 కేసులు వేశారని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన కారణంగా 2023లోనే సదరు ముత్తవల్లిని పదవి నుంచి తొలగించారని అన్నారు. దర్గాలో మతపరమైన సంప్రదాయ కార్యక్రమాలను సజ్జాదే నషీద్ నిర్వహించట్లేదని తెలిపారు. ఆయన నిర్లక్ష్యంపై ఇప్పటికే వక్ఫ్ బోర్డు సీఈఓ కార్యాలయం నుంచి ఆయనకు నోటీసులు కూడా జారీ అయ్యాయని వెల్లడించారు. గతంలో అక్రమాలకు పాల్పడిన, బాధ్యతలను విస్మరించిన సజ్జాదే నషీద్కే మళ్లీ కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారనే సమాచారంతో పలువురు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలిసి ఫిర్యాదు చేశారని తెలిపారు.
కఠిన చర్యలు తప్పవు..
ఏఎస్పేట దర్గా వ్యవహారంలో వక్ఫ్ బోర్డు పూర్తి నిఘా పెట్టిందని అబ్దుల్ అజీజ్ తెలిపారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు అంతర్గత విచారణ జరుగుతోందని అన్నారు. ఈ విచారణ పూర్తి కాగానే తప్పు చేసిన వారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
విశాఖ అగ్నిప్రమాదం.. కార్మికుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. జగన్పై మంత్రి నిమ్మల ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News