వామ్మో.. వానరాలు.. కోతుల గుంపులతో జంకుతున్న జనం
ABN , Publish Date - Aug 26 , 2026 | 10:50 AM
వందలాది కోతులు గుంపులుగా తరలివస్తూ ఒకదానిపై ఒకటి పడి కొట్లాడుతూ బీభత్సం స్పష్టిస్తున్నాయి.
ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి
నియంత్రణకు ముందుకు రాని అధికారులు, ప్రజాప్రతినిధులు
డబ్బులు వసూలు చేసి గ్రామస్థులే కోతులను పట్టించాలనే ఆలోచన
పరకాల(వరంగల్): వందలాది కోతులు గుంపులుగా తరలివస్తూ ఒకదానిపై ఒకటి పడి కొట్లాడుతూ బీభత్సం స్పష్టిస్తున్నాయి. కనిపించిన వారినల్లా చేతి గోళ్లతో రక్కుతూ, కరుస్తూ ప్రజలను వణికిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వందలాదిగా ఒకేసారి గుంపులు గుంపులుగా కోతులు వస్తూ గ్రామాల్లోని ఇళ్లలో చొరబడి చేతికందిన వస్తువు ఎత్తుకుపోవడమే కాకుండా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. పరకాల విలీన గ్రామం సీతారాంపురంలో గతంలో ఏడాది క్రితం చూద్దామన్న కూడా ఒక్క కోతి కూడ కనిపించకపోయేది.
కానీ ఎక్కడి నుంచి వచ్చాయో కానీ వెల్లువగా గ్రామానికి కోతుల గుంపు వచ్చింది. ప్రతి రోజు ఏదో ఒక వాడలో కోతి కరిచిందనే సంఘటన వినిపిస్తూనే ఉంది. దీంతో జనం అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పుకొని అందరూ ఏకతాటిపైకి వచ్చారు. గ్రామంలోని ప్రతీ ఇంటి నుంచి ఎంతో కొంత డబ్బులు వసూలు చేసి మొత్తంగా వచ్చే డబ్బులతో గ్రామంలో కోతులు లేకుండా పట్టించి అడవులో వదిలి పెట్టాలని నిర్ణయించుకున్నారు.
పట్టింపులేని తనంగా మునిసిపల్ అధికారులు
పరకాలను మునిసిపాలిటీగా ఏర్పాటు చేసే క్రమంలో విలీన గ్రామాలైన సీతారాంపురం, రాజుపేట గ్రామాలను విలీనం చేశారు. వెనుకబడిన గ్రామాలను ముందుస్తుగా అభివృద్ధి చేయాలని ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు గొప్పలు చెప్పారు. పరకాల పట్టణంతోపాటు సమానంగా ఇంటి పర్మిషన్లు, ప్రభుత్వంతో ఏ పని కావాలన్న పరకాల పట్టణంతోపాటు పన్నులు వసూలు చేస్తున్నారు. కానీ అభివృద్ధి చేయడం మాత్రం మరిచిపోయారు. ఇప్పటి వరకు గ్రామాన్ని అభివృద్ధిలో తీర్చిదిద్దింది లేదు. ఇంటి పన్ను, నల్లా పన్నుల కోసం ప్రతి రోజు మునిసిపల్ సిబ్బంది తిరుగుతూనే ఉన్నారు. రోడ్లు ఊడ్చడం, డ్రైయినేజీలు తీయడం అనే మాటే లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా, ఈ విషయమై మునిసిపల్ కమిషనర్ పోతరాజు పవన్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు.
ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కౌన్సిలర్లు
తనను కౌన్సిలర్గా గెలిపించినట్లయితే గ్రామంలో ఒక్క కోతి కూడా లేకుండా పట్టించి అడవుల్లో వదిలిపెట్టే బాధ్యత తమదని కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో కోతులతో ఇబ్బంది పడుతున్న జనం గ్రామానికి ఏదో ఒకటి చేస్తాడనే ఆలోచనతో గత పరిపాలకులను వదిలేసి కాంగ్రెస్ అభ్యర్థిని కౌన్సిలర్గా గెలిపించారు. గెలిచిన రోజు ఉత్సవ ర్యాలీలో ఇచ్చిన మాట ప్రకారం వారం పదిరోజుల్లో గ్రామంలో కోతులు లేకుండా చేస్తానని మరోసారి హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏడాది కావస్తున్నా ఒక్క కోతిని పట్టించిన దాఖలాలు లేవు. గ్రామంలోని యువకులు సోషల్ మీడియా ద్వారా గ్రామానికి కోతుల నుంచి రక్షణ కల్పించడానికి ప్రతీ ఇంటి నుంచి రూ. 100 ఇచ్చి కోతుల నియంత్రణకు సహకరించాలని సోషల్ మీడియా ద్వారా గ్రామస్తులు ప్రచారం చేసుకుంటున్నారు.
వందలాదిగా ఒకేసారి ఇళ్లపై పడుతున్నాయి
దుంపేటి కిషన్, సీతారాంపురం
ఒకేసారి పెద్ద ఎత్తున కోతులు ఇళ్లలోకి చొరబడి వండిన వంటల గిన్నెలు, పప్పు డబ్బాలు, ఇంట్లో ఏది దొరికినా ఎత్తుకెళుతున్నాయి. మహిళలు, చిన్నారులు ఉంటే వారిని బెదిరించడమే కాకుండా వారిని కరుస్తున్నాయి. ఎన్నిసార్లు అధికారులు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా, గ్రామస్తులం సమస్యను పరిష్కరించుకోవాలో తెలియడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి:
కొద్దిగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News