ముగిసిన కామారెడ్డి కాంగ్రెస్ పంచాయితీ.. షబ్బీర్ అలీ, చంద్రశేఖర్రెడ్డి రాజీ
ABN , Publish Date - Jun 21 , 2026 | 01:36 PM
గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపిన కామారెడ్డి కాంగ్రెస్ అంతర్గత వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. గాంధీభవన్ వేదికగా జరిగిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమక్షంలో వివాదం ముగిసింది.
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపిన కామారెడ్డి కాంగ్రెస్ అంతర్గత వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. గాంధీభవన్ వేదికగా ఈరోజు (ఆదివారం) జరిగిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమక్షంలో ఈ వివాదం ముగిసింది. ఈ పంచాయితీలో కీలక నేతలు షబ్బీర్ అలీ, చంద్రశేఖర్రెడ్డి పరస్పరం చేతులు కలిపి, కలిసి పనిచేసేందుకు అంగీకరించారు.
క్రమశిక్షణ కమిటీ కీలక సూచనలు..
కామారెడ్డి నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ఠకు భంగం కలగకుండా ఉండటానికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇరువర్గాల నేతలతో సుదీర్ఘంగా చర్చించింది. ఈ సందర్భంగా కమిటీ నేతలకు పలు కీలక సూచనలు చేసింది. వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి, కాంగ్రెస్ బలోపేతం కోసం, పార్టీ ఉన్నతి కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని స్పష్టం చేసింది. నియోజకవర్గంలో పార్టీలో ఎలాంటి సమస్యలు తలెత్తినా, వాటిని అంతర్గతంగా హైకమాండ్ దృష్టికి తీసుకురావాలే తప్ప, బహిరంగ విమర్శలు చేయకూడదని సూచించింది. పార్టీ నేతలు తమ పరిధిలోని వివాదాల కోసం పోలీసుస్టేషన్ల చుట్టూ తిరగడం సరికాదని, దీనివల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. షబ్బీర్ అలీ గతంలో చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలపై తదుపరి సమావేశాల్లో సమగ్రంగా చర్చిస్తామని మల్లు రవి పేర్కొన్నారు.
గాంధీభవన్కు షబ్బీర్ అలీ.. ఆడియో టేపులపై వివరణ..
కాగా, ఈ వివాదంలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ హైదరాబాద్లోని గాంధీభవన్లో క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై తన వివరణ ఇచ్చారు. ఇటీవల సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఆడియో టేపుల వ్యవహారంపై ఆయన స్పందించారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వివాదాస్పద ఆడియో టేపులకు, తనకు ఎలాంటి సంబంధం లేదని షబ్బీర్ అలీ కమిటీకి స్పష్టం చేశారు. ఆ వాయిస్ తనది కాదని ఆయన ఖండించారు. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి, తన ప్రతిష్ఠను దిగజార్చడానికి కొందరు ప్రత్యర్థులు కావాలనే కుట్ర పూరితంగా ఈ ఆడియోను సృష్టించి వైరల్ చేశారని కమిటీ ఎదుట తెలిపారు. షబ్బీర్ అలీ, చంద్రశేఖర్రెడ్డి చేతులు కలపడంతో కామారెడ్డి కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి...
నీట్ అభ్యర్థులు ఒత్తిడికి లోనుకాకుండా పరీక్ష రాయాలి: సీఎం రేవంత్రెడ్డి
27 లక్షల మంది విద్యార్థులకు విజయ పాలు అందిస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News