Share News

ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలకు బ్రేక్.. హైకోర్టు స్టే ఆర్డర్

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:07 AM

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో హైడ్రా అధికారులు శనివారం ఉదయం నుంచి భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టారు. అయితే, ఈ ప్రక్రియలో తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకోవడం, ప్రభుత్వ భూమిని కాపాడటంలో హైడ్రా వ్యూహంపై కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలకు బ్రేక్.. హైకోర్టు స్టే ఆర్డర్
Telangana HighCourt

సంగారెడ్డి జిల్లా, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో హైడ్రా (HYDRA) అధికారులు ఈరోజు (శనివారం) ఉదయం నుంచి భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టారు. అయితే, ఈ ప్రక్రియలో తెలంగాణ హైకోర్టు (Telangana HighCourt) జోక్యం చేసుకోవడం, ప్రభుత్వ భూమిని కాపాడటంలో హైడ్రా వ్యూహంపై కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఐలాపూర్‌లో హైడ్రా చేపట్టిన కూల్చివేతల విషయం హైకోర్టుకు చేరింది. దీంతో ఉద్రిక్త పరిస్థితుల నడుమ హైకోర్టు జోక్యంతో హైడ్రా అధికారులు కూల్చివేతలు నిలిపివేశారు.


కూల్చివేతలకు హైకోర్టు బ్రేక్..

ఐలాపూర్‌లో శనివారం ఉదయం నుంచి కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలకు హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. బాధితులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు, కూల్చివేతలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐలాపూర్‌లోని క్రిస్టల్ డెవలపర్స్ అపార్ట్‌మెంట్ ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించారనే ఆరోపణలతో హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. అంతకుముందే అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేయించారు.


స్థానికుల నిరసన..

తమ కష్టార్జితంతో కొనుక్కున్న ఇళ్లను కూల్చవద్దంటూ స్థానికులు, కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. కూల్చివేతలు జరుగుతున్న సమయంలోనే బాధితులు అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. తమ వద్ద అన్ని అనుమతులు ఉన్నాయని, నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న హైకోర్టు, కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని హైడ్రాను ఆదేశించింది. కోర్టు ఆదేశాల కాపీ అందడంతో అధికారులు తమ యంత్రాలను నిలిపివేసి వెనుదిరిగారు. కోర్టు స్టే ఇవ్వడంతో ప్రస్తుతానికి కూల్చివేతలు ఆగిపోయాయి. కోర్టు నిర్ణయంతో బాధితులు తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నారు. తమ ఆవేదనను కోర్టు అర్థం చేసుకుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రౌడీషీటర్లపై సీపీ సజ్జనార్ కీలక చర్యలు

సీడబ్ల్యూసీలో పార్లమెంటు వ్యూహాలపై అగ్ర నేతల చర్చ

హైదరాబాద్‌లో ప్రేమ పేరుతో వల.. హిందూ అమ్మాయిలే టార్గెట్..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 11 , 2026 | 11:11 AM