పార్కింగ్ అడ్డాగా హైదరాబాద్- శ్రీశైలం హైవే
ABN , Publish Date - Aug 05 , 2026 | 01:41 PM
మహబూబ్నగర్ జిల్లా ఆమనగల్లు పట్టణంలో హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి వాహనాల పార్కింగ్ అడ్డాగా మారింది.
రాకపోకలకు ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
చోద్యం చూస్తున్న ట్రాఫిక్ పోలీసులు
ఆమనగల్లు(మహబూబ్నగర్): మహబూబ్నగర్ జిల్లా ఆమనగల్లు పట్టణంలో హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి వాహనాల పార్కింగ్ అడ్డాగా మారింది. బస్టాండ్ ఎదుట అచ్చంపేట, శ్రీశైలం వెళ్లే ప్రధాన మార్గంలో వాహనాల పార్కింగ్తో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ద్విచక్రవాహనాలు దుకాణాల ఎదుట రోడ్డు మధ్యలో నిలుపుతుండడంతో హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వైపు వెళ్లే వాహనాలకు ఇబ్బందిగా మారింది.
ఒక వైపు చిరు వ్యాపారుల బండ్లు, మరోవైపు ప్రయాణికుల కోసం నిలుపుతున్న ఆటోలు, ఆపై ద్విచక్రవాహనాలు నిలుపుతుండడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బస్టాండ్ నుంచి బస్సులు మల్లే ప్రధాన ద్వారా ఎదుట వాహనాల పార్కింగ్తో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. నెలల కాలంగా పరిస్థితి ఈ విధంగానే ఉంటున్నా ట్రాఫిక్ పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ప్రధాన రహదారిపై వాహనాల పార్కింగ్తో ప్రమాదం పొంచి ఉంది.
ఈ రహదారి మీదుగా నిత్యం శ్రీశైలం, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్కర్నూల్ ప్రాంతాలకు వందల వాహనాలు, వేలమంది ప్రయాణికులు రాకపోకలకు సాగిస్తుంటారు. దుకాణాలు, హోటళ్లకు వచ్చే కొనుగోలుదారులు షాపుల ఎదుట ఎక్కడపడితే అక్కడ గంటల తరబడి వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. పట్టించుకునే వారులేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల వాహన దారులు కూడా పట్టణానికి వచ్చి దుకాణాల ఎదుటే పార్కింగ్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల తీరుపై ప్రయాణికులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమనగల్లు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ లోపం గూర్చి మంగళవారం పలువురు స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఆర్ఎస్ ప్రవీణ్.. కల్వకుంట్ల కుటుంబానికి ఊడిగం చేస్తున్నారు: సంపత్ కుమార్
నీటి విషయంలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు: హరీశ్ రావు
Read Latest AP News And Telangana News And International News And Telugu News