‘ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదు’.. ప్రకాశ్ రాజ్పై భానుప్రకాశ్ రెడ్డి ఫైర్
ABN , Publish Date - Aug 05 , 2026 | 01:19 PM
హిందూ దేవుళ్లపై సోషల్ మీడియాలో పోస్ట్లు, నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై సైబర్ క్రైమ్ డీజీ రవిశంకర్కు బీజేపీ నేతల బృందం ఫిర్యాదు చేసింది. హిందూ దేవుళ్లపై అనరాని మాటలు అంటున్నారని భాను ప్రకాశ్ మండిపడ్డారు.
అమరావతి, ఆగస్టు 5: హిందూ దేవుళ్లపై సోషల్ మీడియాలో పోస్ట్లు, నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై సైబర్ డీజీ రవిశంకర్కు బీజేపీ నేతల బృందం ఫిర్యాదు చేసింది. 57 మంది వివరాలతో బీజేపీ నేతలు భానుప్రకాశ్ రెడ్టి, వల్లూరు జయప్రకాశ్, షేక్ బాజీ, శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్ మాట్లాడుతూ.. భారత సంస్కృతిలో శ్రీరామచంద్రుడిని ఆరాధ్య దైవంగా చూశామని.. దేవతా మూర్తులు మాతా సరస్వతి, లక్ష్మీదేవి, సీతమ్మను తల్లిగా భావిస్తున్నామని తెలిపారు.
హిందూ దేవుళ్లపై అనరాని మాటలు అంటున్నారని భాను ప్రకాశ్ మండిపడ్డారు. ఆ వీడియోలను చూడలేకపోయామన్నారు. హిందూ దేవుళ్లను ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. ‘ఒళ్లు జాగ్రత్త, తోలు తీస్తాం! వదిలే ప్రసక్తే లేదు!’ అని హెచ్చరించారు. హిందూ దేవుళ్లపై ప్రకాశ్ రాజ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శ్రీరామచంద్రుడు ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి వచ్చారని, పండ్లు దొంగిలించారని చెబుతున్నారని ఫైర్ అయ్యారు. దమ్ము, ధైర్యం ఉంటే అన్యమతస్తుల్లో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడాలని సవాల్ విసిరారు. కేవలం హిందూ మతం, హిందూ దేవుళ్లపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
ఆదోనిలో చిరుత సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు
అమరావతిలో ఏపీ భవిష్యత్తు, ఆత్మగౌరం కనిపిస్తోంది: అనిత
Read Latest AP News And Telugu News