భద్రాద్రి కొత్తగూడెంలో పెద్దపులి కలకలం.. గ్రామంలో ఎద్దుపై దాడికి యత్నం
ABN , Publish Date - Jun 29 , 2026 | 10:04 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామంలో పెద్దపులి కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామంలో పెద్దపులి కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. గ్రామ శివారులో సంచరించిన పులి ఓ ఎద్దుపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. గ్రామ సమీపంలో మేత మేస్తున్న పశువుల వద్దకు వచ్చిన పెద్దపులి ఎద్దుపై దాడికి యత్నించింది. అయితే పశువుల కదలికలు, గ్రామస్థుల అప్రమత్తత కారణంగా పులి అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన అనంతరం గ్రామ ప్రజలు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పులి సంచారాన్ని నిర్ధారించేందుకు పాదముద్రల ఆధారంగా అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. పులి వెళ్లిన దిశను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో ఒంటరిగా అడవి ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజలకు అధికారులు హెచ్చరించారు. పశువులకు రక్షణ కల్పించాలని, పులి కదలికలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
అశ్వారావుపేట పరిసర ప్రాంతాలు అడవులకు సమీపంగా ఉండటంతో అప్పుడప్పుడు అడవి జంతువుల సంచారం కనిపిస్తుంటుందని స్థానికులు తెలిపారు. అయితే పెద్దపులి గ్రామ శివారులో కనిపించడం ఇటీవల అరుదైన సంఘటనగా స్థానికులు చెబుతున్నారు. పులి ఇంకా పరిసర ప్రాంతాల్లోనే ఉందా లేదా తిరిగి అడవి లోపలికి వెళ్లిందా అనే విషయంపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో పెద్దపులి ఆనవాళ్లు కనిపించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండగా, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆధునిక భారత నిర్మాణంలో పీవీ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్రెడ్డి
ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి: మంత్రి దామోదర
Read Latest Telangana News And AP News And National News
And Telugu News