Share News

తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు .. 2026-27 నుంచి కొత్త విధానం అమలు

ABN , Publish Date - May 14 , 2026 | 08:09 PM

ఇంటర్ విద్యా విధానంలో తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి కీలక మార్పులు చేపట్టేందుకు సిద్ధమైంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు .. 2026-27 నుంచి కొత్త విధానం అమలు
Intermediate Educatio

హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ విద్యా విధానంలో తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి కీలక మార్పులు చేపట్టేందుకు సిద్ధమైంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్, కాన్సెప్ట్ ఆధారిత అభ్యాసం పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసింది. కొత్త విధానంలో సైన్స్‌, మ్యాథ్స్‌, భాషా విభాగాల్లో పరీక్షల సరళి, మార్కుల విధానం, ప్రాక్టికల్స్‌ నిర్వహణలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్స్..

ఇప్పటి వరకు ఇంటర్ సెకండియర్‌లో మాత్రమే ప్రాక్టికల్స్ నిర్వహించగా, కొత్త విధానంలో ఇంటర్ ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్ ప్రవేశపెట్టనున్నారు. ప్రత్యేకంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ విభాగాల్లో ఫస్టియర్ విద్యార్థులకు కూడా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.


ప్రాక్టికల్స్‌కు 15 మార్కులు..

కొత్త విధానం ప్రకారం.. ఇంటర్ ఫస్టియర్‌లో, సెకండియర్‌లో 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ నిర్వహించనుంది. దీంతో విద్యార్థులు కేవలం థియరీకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక పరిజ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది.

మ్యాథ్స్‌లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్..

మ్యాథమేటిక్స్ బోధనలోనూ కీలక మార్పులు తీసుకురానుంది. సంప్రదాయ పద్ధతికి బదులుగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌ను అమలు చేయనుంది. దీంతో విద్యార్థులు సూత్రాలను అర్థం చేసుకోవడం, సమస్య పరిష్కార నైపుణ్యాలు పెంపొందించుకోవడం, కాన్సెప్ట్ ఆధారిత విద్యనభ్యసించడం వంటి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.


మ్యాథ్స్‌లో ఫైనల్ పరీక్ష మార్కుల తగ్గింపు..

ప్రస్తుతం మ్యాథ్స్‌లో 75 మార్కులకు ఫైనల్ పరీక్ష నిర్వహిస్తుండగా, కొత్త విధానంలో దాన్ని 60 మార్కులకు తగ్గించనుంది. అదేవిధంగా యాక్టివిటీలు, ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు ప్రాధాన్యం పెంచే అవకాశం ఉంది.

ఫైనల్ పరీక్షలు 80 మార్కులకు..

ఇప్పటివరకు ఇంటర్ పరీక్షలు 100 మార్కులకు నిర్వహించగా, ఇకపై వాటిని 80 మార్కులకు నిర్వహించనున్నట్లు సమాచారం. మిగిలిన మార్కులను ఇంటర్నల్ అసెస్‌మెంట్ ప్రాక్టికల్స్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా కేటాయించే అవకాశం ఉంది.

భాషా విభాగాల్లో ఇంటర్నల్ అసెస్‌మెంట్..

తెలుగు, ఇంగ్లీష్, హిందీ వంటి భాషా విభాగాల్లో 20 మార్కులను ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు కేటాయించనుంది. ఇందులో ప్రాజెక్టులు సెమినార్లు, అసైన్‌మెంట్లు, క్లాస్‌రూమ్ పనితీరు ఆధారంగా మార్కులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


విద్యార్థులపై ఒత్తిడి తగ్గే అవకాశం..

ఈ కొత్త విధానంతో విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి కొంతమేర తగ్గే అవకాశం ఉందని విద్యా నిపుణులు భావిస్తున్నారు. ఒక్క ఫైనల్ పరీక్ష ఆధారంగా కాకుండా, ఏడాది పొడవునా విద్యార్థుల పనితీరును అంచనా వేసే విధానం అమల్లోకి రానుంది.

జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా మార్పులు..

ఈ సంస్కరణలు జాతీయ విద్యా విధానం(NEP)కు అనుగుణంగా తీసుకువస్తున్నట్లు సమాచారం. విద్యార్థుల్లో సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచన, ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా విద్యా నిపుణులు పేర్కొంటున్నారు.


తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఆసక్తి..

ఇంటర్ విద్యా విధానంలో వస్తున్న ఈ మార్పులు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాక్టికల్స్, ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక

సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్

పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 14 , 2026 | 08:36 PM