విద్యానాణ్యత మెరుగుదలపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. డీఈఓలకు కీలక ఆదేశాలు..
ABN , Publish Date - Jun 11 , 2026 | 06:41 PM
డీఈఓలకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును (ఎన్రోల్మెంట్) పెంచాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్.. డీఈఓలకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్, జూన్11, (ఆంధ్రజ్యోతి): డీఈఓలకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును (ఎన్రోల్మెంట్) పెంచాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్.. డీఈఓలకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. పాఠశాలలు పున:ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థుల అభ్యాస ఫలితాలు, విద్యా నాణ్యత మెరుగుదలకు అన్ని పాఠశాలల్లో అకాడమిక్ ప్యానెల్ తనిఖీలు నిర్వహించాలని మార్గనిర్దేశం చేశారు. ఏ పాఠశాలలోనూ ఉపాధ్యాయుల కొరత ఉండకూడదని అన్నారు. ఉపాధ్యాయుల నియామకాలు, సర్దుబాటు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
పాఠశాల మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా నిర్వహించాలని నవీన్ నికోలాస్ దిశానిర్దేశం చేశారు. విద్యార్థుల అభ్యాస ఫలితాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం (FLN) బలోపేతం చేయడంతో పాటు ప్రీ-ప్రైమరీ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్దేశించారు. యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ తదితర విద్యార్థుల హక్కుల పంపిణీని సకాలంలో పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేశారు.
అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం (Mid-Day Meal) నాణ్యత, తయారీ, వడ్డింపు ప్రక్రియలను నిరంతరం పర్యవేక్షించాలని నవీన్ నికోలాస్ ఆదేశించారు. విద్యార్థుల నమోదు పెంపు కార్యక్రమాల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (AAPC) సభ్యులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ విద్యార్థుల అభ్యాస ఫలితాల మెరుగుదల సంవత్సరంగా మార్చేందుకు సమష్టి కృషి, నిబద్ధతతో పనిచేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారు: సీఎం రేవంత్రెడ్డి
కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి: ప్రధాని మోదీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News