Share News

ఐటీ రంగం విస్తరణపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్..

ABN , Publish Date - May 20 , 2026 | 07:04 PM

ఐటీ రంగాన్ని హైదరాబాద్‌కే పరిమితం కాకుండా జిల్లాలకు విస్తరించే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ వెలుపల గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCCs) ఏర్పాటు చేసే సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు.

ఐటీ రంగం విస్తరణపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్..
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): ఐటీ రంగాన్ని హైదరాబాద్‌కే పరిమితం కాకుండా జిల్లాలకు విస్తరించే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ వెలుపల గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCCs) ఏర్పాటు చేసే సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. నిజామాబాద్–కరీంనగర్–వరంగల్ హైవేల వెంట జీసీసీలు, ఐటీ సంస్థలు ఏర్పాటు అయ్యేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ‘బియాండ్ హైదరాబాద్’ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లాల్లో ఐటీ విస్తరణ ద్వారా యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.


కంపెనీలకు ఇన్సెంటివ్స్..

అదేవిధంగా డేటాసెంటర్ల ఏర్పాటుకు కంపెనీలకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొత్త డేటా సెంటర్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ (Future City) అభివృద్ధిపై కూడా సీఎం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఫ్యూచర్ సిటీలో నెట్-జీరో విధానాలు అమలు చేయాలని, ప్రపంచ స్థాయి ఏఐ సదుపాయాలతో ‘ఏఐ సిటీ’ని అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే హెల్త్ సిటీ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. హెల్త్ సిటీ ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వ సహకారం కోసం చర్చలు జరపాలని సీఎం సూచించారు. కంపెనీలు భూమిపూజలకు సిద్ధంగా ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.


‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో ప్రత్యేక ఏజెన్సీ..

యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించే దిశగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో (Young India Skills University) కంపెనీలు ఎంఓయూలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో ప్రత్యేక ఏజెన్సీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పెట్టుబడిదారులకు ఒకే వేదికపై అన్ని అనుమతులు అందించే విధానాన్ని తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేసి తెలంగాణలో అమలు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే వచ్చే మూడు నెలల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ-ఫైబర్ కనెక్టివిటీ కల్పించాలని ఆదేశించారు. టీ-ఫైబర్ ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.54 కోట్లు విడుదలైనట్లు అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కేసీఆర్ హయాంలో ఆ ప్రాజెక్టుకు భూసేకరణ లేకుండానే టెండర్లు పిలిచారు.. మంత్రి ధ్వజం

టీజీ పీజీఈసెట్ పరీక్ష షెడ్యూల్ మార్పు.. కొత్త తేదీ ఇదే

అక్రమాస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్ అరెస్ట్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 20 , 2026 | 07:11 PM