హైడ్రా యాక్షన్.. పదేళ్ల సమస్యకు పరిష్కారం..
ABN , Publish Date - Feb 19 , 2026 | 05:57 PM
హైదరాబాద్ పంజాగుట్టలో హైడ్రా మరోసారి తన మార్క్ చూపించింది. చట్నీస్ రెస్టారెంట్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించిన మెట్ల మార్గాన్ని అధికారులు ఇవాళ తెరిపించారు..
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్లోని చట్నీస్ (Chutneys) పంజాగుట్ట బ్రాంచ్లో దశాబ్ద కాలంగా నెలకొన్న వివాదానికి హైడ్రా (HYDRAA) అధికారులు తెరదించారు. చట్నీస్ హోటల్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా మూసివేసిన మెట్ల మార్గాన్ని హైడ్రా అధికారులు ఇవాళ (గురువారం) తెరిపించారు. పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యపై హైడ్రా తీసుకున్న నిర్ణయం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది.
వివాదానికి కారణమిదే..?
పంజాగుట్టలోని చట్నీస్ హోటల్ నిర్వాహకులు భవనంలోని పై అంతస్తులకు వెళ్లే మెట్ల మార్గాన్ని నిబంధనలకు విరుద్ధంగా మూసివేసి అడ్డంకులు సృష్టించారని బాధితులు ఆరోపించారు. ముఖ్యంగా కరోనా లాక్డౌన్ సమయం నుంచి పైఅంతస్తుల్లోని ఇతర యజమానులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకున్నారని తెలిపారు. గత పదేళ్లుగా భవనంలోని ఇతర యజమానులు తమ వ్యాపారాలకు, రాకపోకలకు ఆటంకం కలుగుతోందని జీహెచ్ఎంసీ (GHMC) అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని తెలిపారు. అయితే ఈ సమస్యపై బాధితులు ఇటీవల హైడ్రా అధికారులను ఆశ్రయించారు. ఫిర్యాదును స్వీకరించిన హైడ్రా బృందం ఇవాళ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, వెంటనే ఆ మెట్ల మార్గాన్ని తెరిపించారు. హైడ్రా రాకతో తమ సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అయిందంటూ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు.. కేసీఆర్పై కడియం శ్రీహరి సెటైర్లు
మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..
Read Latest Telangana News And AP News And Telugu News