మెట్రో స్వాధీనం వేళే.. సర్కారు చేతికి భూములు
ABN , Publish Date - Mar 19 , 2026 | 07:50 AM
మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టు స్వాధీన ప్రక్రియ వేగవంతమైంది. వందల ఎకరాలతో ముడిపడి ఉన్న మెట్రో ప్రాజెక్టును ఎల్అండ్టీ మెట్రో హైదరాబాద్ సంస్థ నుంచి స్వాధీనం చేసుకునే సమయంలోనే ఆ భూములన్నీ సర్కారు చేతికి రానున్నాయి.
ఎల్అండ్టీ వద్ద 269 ఎకరాలు
104 ఎకరాల్లో ఉప్పల్ మెట్రో డిపో..
96 ఎకరాల్లో మియాపూర్ డిపో
5 ప్రాంతాల్లో మెట్రో మాల్స్, వ్యాపార భవనాలు
ఖాళీగా సుమారు 15-20 ఎకరాలు
నెలాఖరుకు పూర్తికానున్న ప్రక్రియ
హైదరాబాద్ సిటీ: మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టు స్వాధీన ప్రక్రియ వేగవంతమైంది. వందల ఎకరాలతో ముడిపడి ఉన్న మెట్రో ప్రాజెక్టును ఎల్అండ్టీ మెట్రో హైదరాబాద్ సంస్థ నుంచి స్వాధీనం చేసుకునే సమయంలోనే ఆ భూములన్నీ సర్కారు చేతికి రానున్నాయి. మార్చి 31 నాటికి టేకోవర్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్చలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో, అనంతరం బేగంపేటలోని మెట్రో రైలు భవన్లో సాయంత్రం మెట్రో అధికారులు సమావేశయ్యారు.
మొదటి దశ మెట్రోకు 269 ఎకరాల భూమి
మెట్రో తొలి దశ నిర్మాణంలో భాగంగా అప్పటి ప్రభుత్వం మూడు కారిడార్లలో 3 చోట్ల మొత్తం 212 ఎకరాలు మెట్రో రైళ్ల డిపోల కోసం, మరో 57 ఎకరాలు మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్, సర్యులేషన్ ఏరియాల కోసం ఇచ్చారు. ఆ సమయంలో ప్రభుత్వం సుమారు 269 ఎకరాల భూమిని ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో లిమిటెడ్కు అప్పగించారు.. ఇందులో 2 ఎకరాలపై వివాదం ఉండడంతో ఆ భూమిని అప్పగించలేదు. 267 ఎకరాల భూమిని మెట్రో మౌలిక వసతులు, కమర్షియల్ అభివృద్ధి కోసం వినియోగించుకునేలా ఒప్పందం కుదిరింది.
ఉప్పల్లో మెట్రో డిపో నిర్మాణానికి సుమారు 104 ఎకరాలు, మియాపూర్లో మెట్రో డిపో కోసం 96 ఎకరాలు వినియోగించారు. మిగిలిన భూముల్లో ఐదు ప్రాంతాలైన పంజాగుట్ట, ఎర్రమంజిల్, మూసారంబాగ్, మాదాపూర్-హైటెక్ సిటీ, రాయదుర్గం వద్ద ఎల్ అండ్ టీ సంస్థ మెట్రో మాల్స్ వాణిజ్య సముదాయాలు నిర్మించగా, రాయిదుర్గంలో ప్రత్యేక కమర్షియల్ భవనం అభివృద్ధి చేశారు. అక్కడ మిగిలి ఉన్న కొంత భూమిని పైవ్రేటు సంస్థలకు దీర్ఘకాలిక లీజుపై ఎల్అండ్టీ మెట్రో సంస్థ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
రాయదుర్గంలో 15 ఎకరాలు దీర్ఘ కాలిక సబ్ లీజుకు
రాయదుర్గంలో ఎల్అండ్టీ మెట్రోకు ఇచ్చిన 15 ఎకరాల స్థలంలో సొంతంగా అభివృద్ధి చేసే ఆర్థిక స్థోమత లేకపోవడంతో దీర్ఘ కాలిక లీజుకు ఇచ్చింది. సుమారు 50 ఏళ్ల పాటు సబ్ లీజుకు ఇవ్వడం ద్వారా ఎల్అండ్టీ సంస్థ సుమారు రూ.1200 కోట్లను తీసుకొని మెట్రో ప్రాజెక్టు కోసం వినియోగించుకుంది. ప్రస్తుతం ఈ స్థలంలో ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థలు భవన నిర్మాణ కార్యకలాపాలు చేపట్టాయి. రవాణా ఆఽధారిత అభివృద్ధి (టీఓడీ)లో భాగంగా ఇచ్చిన భూముల్లో ఇంకా కొన్ని చోట్ల భూములు ఖాళీ ఉన్నాయని మెట్రో అధికారులు తెలిపారు. ముఖ్యంగా మియాపూర్ మెట్రో డిపో పక్కన సుమారు 10 ఎకరాలకు పైగా స్థలం ఉంది. అమీర్పేట సారఽథి స్టూడియో ఎదురుగా సుమారు ఎకరానికి పైగా స్థలం ఎల్ అండ్ టీ వద్ద ఉంది.
ఆస్తులన్నీ ప్రభుత్వం పేరు మీదే..
ప్రస్తుతం మెట్రో ప్రాజెక్టును స్వాధీనం చేసుకునే నిర్ణయం నేపథ్యంలో సంస్థకు చెందిన స్థిర, చర ఆస్తులన్నీ ప్రభుత్వ పేరుకు బదిలీ కానున్నాయి. మొదటి దశ మెట్రో ప్రాజెక్టు ప్రభుత్వ నియంత్రణలోకి వచ్చిన తరువాత భవిష్యత్ విస్తరణ దశలు వేగవంతం కావచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News