హబ్షాన్ గ్యాస్ ఫెసిలిటీ, బాబ్ ఆయిల్ ఫీల్డ్ కార్యకలాపాలు నిలిపివేత
ABN , Publish Date - Mar 19 , 2026 | 07:23 AM
అబుదాబి గ్యాస్ ప్లాంట్ల మీద ఇరాన్ క్షిపణి దాడి చేసింది. దీనిని యూఏఈ గాలిలోనే అడ్డుకున్నప్పటికీ, హబ్షాన్ గ్యాస్ ఫెసిలిటీ, బాబ్ ఆయిల్ ఫీల్డ్ ప్రాంతంలో శకలాలు పడ్డాయి. దీంతో గ్యాస్ ప్లాంట్లలో కార్యకలాపాలు నిలిపివేశారు.
అబుదాబి, ఫిబ్రవరి 19: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడంలేదు. ఖతార్పై దాడుల అనంతరం ఇరాన్ ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధాని అబుదాబిని లక్ష్యంగా చేసుకుంది. తాజాగా అబుదాబిలోని హబ్షాన్ (Habshan) గ్యాస్ ప్లాంట్ సమీపంలో క్షిపణి శకలాలు పడటంతో, భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ కార్యకలాపాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
అబుదాబి మీడియా ఆఫీస్ తెలిపిన వివరాల ప్రకారం, శత్రువుల క్షిపణిని గాలిలోనే అడ్డుకున్న సమయంలో దాని శకలాలు హబ్షాన్ గ్యాస్ ఫెసిలిటీ, బాబ్ (Bab)ఆయిల్ ఫీల్డ్ ప్రాంతంలో పడ్డాయి. దీనివల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, ముందు జాగ్రత్త చర్యగా ప్లాంట్స్ కార్యకలాపాలను ఆపివేశారు.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ కూటమి జరుపుతోన్న దాడులకు ప్రతికారంగా ఇరాన్ ఈ దాడులను నిర్వహిస్తోంది. దీనిని ఇరాన్ 'ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4'గా పేర్కొంటోంది. కేవలం అబుదాబి మాత్రమే కాకుండా, ఖతార్లోని రాస్ లఫ్ఫాన్, సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం.
ఈ దాడులను యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని, తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎమిరేట్స్ వైమానిక దళం అప్రమత్తంగా ఉంది. క్షిపణులను విజయవంతంగా అడ్డుకుంటున్నప్పటికీ, పడుతున్న శకలాలు ఆస్తి నష్టానికి, భయాందోళనలకు కారణమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
రజినీని బాధపెట్టాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు.. టీవీకే నేత క్షమాపణలు..
భారీ అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవ దహనం!