హైదరాబాద్లో గంజాయి పాల కలకలం.. అసలేమైందంటే..
ABN , Publish Date - Feb 17 , 2026 | 07:35 PM
హైదరాబాద్లోని బేగంబజార్లో వెలుగులోకి వచ్చిన గంజాయి పాల ఉదంతం నగరవాసులను తీవ్ర ఆందోళనలకు గురిచేస్తోంది. ముఖ్యంగా యువతను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న ఈ అక్రమ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు..
హైదరాబాద్, ఫిబ్రవరి17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలోని బేగంబజార్ ప్రాంతంలో గంజాయి కలిపిన పాల విక్రయాలు కలకలం సృష్టించాయి. బేగంబజార్లో వెలుగులోకి వచ్చిన ఈ గంజాయి పాల ఉదంతం నగరవాసులను తీవ్ర ఆందోళనలకు గురిచేస్తోంది. ముఖ్యంగా యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న ఈ అక్రమ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సాధారణ పాల విక్రయాల ముసుగులో నిషేధిత గంజాయి ఉత్పత్తులను విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సాధారణ పానీయం తరహాలో అధికారుల కళ్లు గప్పి ఈ దందాను కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
చాక్లెట్ రూపంలో..
పాలల్లో గంజాయి చాక్లెట్స్ కలిపి వినియోగదారులకు విక్రయిస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన వికాస్ శర్మను పోలీసులు ఇవాళ(మంగళవారం) అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, నిందితుడు గంజాయి పదార్థాలను చాక్లెట్ రూపంలో తయారు చేసి వాటిని పాలలో కలిపి విక్రయిస్తున్నాడు. ఈ చర్య ద్వారా యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నివాసంలో నిర్వహించిన సోదాల్లో మొత్తం 1,920 గంజాయి చాక్లెట్స్ బయటపడ్డాయి.
వివిధ ప్రాంతాలకు సరఫరా..
ఈ చాక్లెట్స్ను అక్రమంగా నిల్వ చేసి భాగ్యనగరంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. గంజాయి సరఫరా వెనుక ఉన్న నెట్వర్క్పై దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరికి సరఫరా చేశాడనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. నగరంలో మత్తు పదార్థాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని, ప్రజలు కూడా అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ మంత్రి ఎర్రబెల్లి భావోద్వేగం. ఎందుకంటే..
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రద్దు: హైకోర్టు స్టేతో మారిన సమీకరణాలు
Read Latest Telangana News And AP News And Telugu News