కరీంనగర్ ఘటనపై డీజీపీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
ABN , Publish Date - May 08 , 2026 | 03:25 PM
డీజీపీ సీవీ ఆనంద్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు. కరీంనగర్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ కార్యకర్తల దాడి అంశంపై డీజీపీకి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్, మే 8: రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలపై డీజీపీకి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కరీంనగర్లో నిన్న(గురువారం) మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై డీజీపీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలపై దాడులను అరికట్టాలని, శాంతిభద్రతలను కాపాడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అలా ప్రశ్నించినందుకే దాడులు: దాసోజు శ్రవణ్
కరీంనగర్లో కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్పై దాడిని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఖండించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై డీజీపీ సీవీ ఆనంద్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసీఆర్ కొడుకువే నా అని కేటీఆర్ను ప్రశ్నించడం సరైందని కాదని కౌశిక్ రెడ్డి ప్రశ్నించినందుకే దాడులు చేశారని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తంబాకు తింటాడని అన్నందుకే దాడులు చేస్తారా అని నిలదీశారు. కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉండి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా బండి సంజయ్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని భావిస్తున్నామని దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు.
తగిన గుణపాఠం చెబుతాం: వివేకానంద గౌడ్
బండి సంజయ్, ముఖ్యమంత్రి చీకటి ఒప్పందాలు.. వ్యాపారాలు అందరికి తెలుసని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్కు అహకారం పెరిగిందన్నారు. ‘మీ భాషపై మీ భాషలో చెబితే దాడులు చేస్తారా. కౌశిక్ రెడ్డి ఏమి తప్పు మాట్లాడారో చెప్పాలి. వచ్చేది మా ప్రభుత్వం. అప్పుడు బండి సంజయ్ గుజరాత్ వెళ్లి దాక్కోవాలి. అన్ని ఆధారాలను డీజీపీకి ఇచ్చాం. రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతాం’ అని వివేకానంద గౌడ్ హెచ్చరించారు.
శాంతిభద్రతలు దిగజారిపోయాయి: పల్లా రాజేశ్వర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. వెనుకబడిన రాష్ట్రాలలో ఏ విధంగా ఉన్నదో అదే తెలంగాణలో ఉందన్నారు. నచ్చని రాజకీయ పార్టీల నేతల కార్యాలయాలు, ఇళ్లపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్లో పోలీసుల చేతగానితనాన్ని డీజీపీకి వివరించినట్లు తెలిపారు. నిన్ను కౌశిక్ రెడ్డిని చంపాలని వచ్చారన్నారు. బండి సంజయ్ రెచ్చగొడితేనే కార్యకర్తలు వచ్చారని.. ఆయనపై కేసు నమోదు చేయాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
తలసేమియా వ్యాధిగ్రస్తులకు అండగా ఉంటాం: మంత్రి దామోదర రాజనర్సింహ
ఎన్ని ఇబ్బందులున్నా ప్రాణహిత ప్రాజెక్ట్ను నిర్మించి తీరుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు
Read Latest Telangana News And Telugu News