టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరిగితే పాలన సులభతరం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - May 08 , 2026 | 01:05 PM
ఏపీ సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. ప్రజలకు త్వరితగతిన సేవలు అందిస్తూ.. ఆన్లైన్ సేవలను పూర్తిగా అందుబాటులోకి తెస్తే ప్రజల సమయం వృధా కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
అమరావతి, మే 8: రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. అవేర్ సహా వాట్సాప్ గవర్నెన్సు వినియోగంపై కలెక్టర్లకు సీఎం సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనలు, ప్రొసీజర్స్ సులభతరం కావాలన్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే ఎంత టైమ్ వృధా అవుతుందో ఆలోచించాలని అన్నారు. ప్రజలకు త్వరితగతిన సేవలు అందిస్తూ.. ఆన్లైన్ సేవలను పూర్తిగా అందుబాటులోకి తెస్తే ప్రజల సమయం వృధా కాదని తెలిపారు. టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరిగితే పాలన సులభతరం అవుతుందని సూచించారు. వాట్సాప్ గవర్నెన్సు మనమిత్ర ద్వారా పౌరసేవలపై ప్రజలకు శిక్షణ ఇస్తున్నామని సీఎం తెలిపారు.
ఇప్పటికే 29 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చామని.. 90 శాతం ప్రభుత్వ సేవలు వాట్సాప్లో అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. డిసెంబర్ నాటికి అన్ని సేవలను వాట్సాప్లో అందించేలా చూడాలని ఆదేశించారు. మాన్యువల్ టచ్ పాయింట్ల వద్దకు వచ్చే ప్రజలకు వాట్సాప్ వినియోగాన్ని వివరించాలన్నారు. స్మార్ట్ ఫోన్లు లేని కుటుంబాలు 34 శాతంగా ఉన్నాయన్నారు. ఆన్లైన్ సేవల ద్వారా అవినీతితో పాటు దుర్వినియోగం కూడా తగ్గుతుందని చెప్పుకొచ్చారు.
అవేర్ 2.0 నుంచి వచ్చే సమాచారాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. పిడుగుల హెచ్చరికలను జారీ చేయటంలో ఇంకా పర్ఫెక్షన్ రావాలన్నారు. తుఫాన్ల హెచ్చరికల సమయంలో నేరుగా మొబైళ్లకే మెసేజ్లు పంపించాలని తెలిపారు. తుఫాన్ల హెచ్చరికలను స్వర్ణ గ్రామ, వార్డుల ద్వారా కూడా పంపించాలని అన్నారు. సీవీడ్ సాగుపై తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు దృష్టి సారించాలని సూచించారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో అక్రమ కట్టడాలపై దృష్టి సారించాలన్నారు. మున్సిపాలిటీలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు చేశారు.
ఇవి కూడా చదవండి..
నకిలీ విత్తనాలతో మోసం.. తీవ్ర నష్టాల్లో రైతులు
రాయలసీమకు దూసుకొస్తున్న ‘రాయల్ ఎన్ఫీల్డ్’: ఎక్స్లో సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News