టీ20 ప్రపంచ కప్ 2026: అభిషేక్కు అనారోగ్యం.. ఆ స్టార్ ఆల్రౌండర్ రీఎంట్రీ!
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:32 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచులో స్టార్ పేసర్ బుమ్రా దూరమైన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ కూడా అనారోగ్యం బారిన పడ్డాడు. మరోవైపు గాయంతో జట్టుకు దూరమైన వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్ సాధించాడు..
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే వైరల్ ఫీవర్ కారణంగా మొదటి మ్యాచ్లో స్టార్ పేసర్ బుమ్రా ఆడని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాకు మరో షాకింగ్ న్యూస్. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) కూడా అనారోగ్యం బారిన పడ్డాడు. శనివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా అభిషేక్ తొలి బంతికే డకౌట్గా వెనుదిరిగాడు. అనంతరం ఫీల్డింగ్ కూడా చేయలేదు. అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శాంసన్ ఫీల్డింగ్ చేసిన విషయం తెలిసిందే.
బుమ్రా ఇప్పటికే జ్వరం కారణంగా తొలి మ్యాచుకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా అనారోగ్యం బారిన పడటంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. నమీబియాతో గురువారం జరిగే మ్యాచుకు వీరిద్దరూ అందుబాటులో ఉంటారా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
వాషీ వస్తున్నాడు..
న్యూజిలాండ్తో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్(Washington Sundar) తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉన్నాడు. అయితే గురువారం జరిగే మ్యాచుకు వాషీ భారత జట్టుతో కలవనున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. ‘వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించాడు. నమీబియా మ్యాచుకు ముందు అతడు ఢిల్లీలో జట్టుతో కలుస్తాడు’ అని వెల్లడించాడు. హర్షిత్ రాణా ఇప్పటికే గాయపడి టోర్నీ నుంచే తప్పుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో వాషీ కోలుకోవడం టీమిండియాకు కాస్త ఊరటనిచ్చే విషయమే.
ఇవి కూడా చదవండి:
అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్
టీ20 ప్రపంచ కప్ 2026: తొలి మ్యాచుకు బుమ్రా దూరం!