నగర రోడ్లపై కార్లు కనిపించవు...
ABN , Publish Date - Jul 26 , 2026 | 09:50 AM
రోడ్డు మీదకు వచ్చామంటే చాలు ఒకటే వాహనాల రొద. రోడ్డు దాటాలంటే గగనమే అవుతోంది. ముఖ్యంగా నగరాల్లో షాపింగ్కు వెళ్లినా, ఆసుపత్రికి వెళ్లినా కారు పార్కింగ్ చేద్దామంటే స్థలం దొరకదు.
రోడ్డు మీదకు వచ్చామంటే చాలు ఒకటే వాహనాల రొద. రోడ్డు దాటాలంటే గగనమే అవుతోంది. ముఖ్యంగా నగరాల్లో షాపింగ్కు వెళ్లినా, ఆసుపత్రికి వెళ్లినా కారు పార్కింగ్ చేద్దామంటే స్థలం దొరకదు. ఇలాంటి ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న ఒక మేయర్... నగరంలోకి కార్లు రావడంపై నిషేధం విధించాడు. దాంతో ఒకప్పుడు వాహనాల రద్దీతో సతమతమైన ఆ నగర వీధులన్నీ ఒక్కసారిగా ప్రశాంతంగా మారాయి. ప్రజలు రోడ్లపై స్వేచ్ఛగా తిరుగు తున్నారు. ఇంతకీ ఈ విశిష్ట నగరం ఎక్కడుందంటే...
నగరంలోని ప్రధాన వీధులు, షాపింగ్ మాల్స్ జనాలతో కిక్కిరిసి ఉన్నాయి. రోడ్లపై ప్రజలంతా పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. ఆ షాపింగ్ కూడళ్లలోహారన్ల శబ్దాలు వినిపించడం లేదు. వాహన కాలుష్యం మచ్చుకైనా లేదు. వాతావరణం ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంది. మహానగరాల్లో ఇలాంటి సీన్ సాధ్యమా? అంటే... సాధ్యమేనని నిరూపించారు పోంటెవెద్రా వాసులు.
మేయర్ నిర్ణయం...
స్పెయిన్లో ఉన్న పోంటెవెద్రా నగరంలోకి కార్ల ప్రవేశంపై నిషేధం ఉంది. హైదరాబాద్, ముంబయి, ఢిల్లీ వంటి మహానగరాల్లో వాహనాల వల్ల కలిగే ఇబ్బందులను ఏదో ఒక సమయంలో అందరూ అనుభవించినవారే. అయితే ‘అలాంటి ఇబ్బందులు నా నగరంలో ఉండకూడదు’ అని నిర్ణయించారు పోంటెవెద్రా మేయర్ మిగెల్ అంక్సో ఫెర్నాండెజ్ లోరెస్. నగర మేయర్గా లోరెస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పోంటెవెద్రా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఆయన మేయర్ కాకముందు నగరం తీవ్ర కాలుష్యంతో, ట్రాఫిక్ రద్దీతో ఉండేది. కార్లపై నిషేధం విధించాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ట్రాఫిక్ సిగ్నల్స్ తొలగించారు. ఫుట్పాత్లను వెడల్పు చేశారు. కార్ల హడావుడి లేకపోవడంతో ప్రజలు వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. కార్ల కన్నా మనుషులకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన వినూత్న నగరంగా పోంటెవెద్రా గుర్తింపు పొందింది. అంతేకాదు, మేయర్ నిర్ణయం ఆ నగరానికి ఎన్నో అవార్డులను కూడా తెచ్చిపెట్టింది.
కొన్నింటికి మాత్రమే మినహాయింపు...
స్పెయిన్లోని ఇతర నగరాల్లో ఉన్నట్టుగా ట్రాఫిక్ శబ్దాలతో నిండిన వాతావరణం పోంటెవెద్రాలో కనిపించదు. పక్షుల కిలకిల రావాలు, కాఫీ కప్పుల్లో చెంచాల చప్పుడు, ప్రజల సంభా షణలు మాత్రమే వినిపిస్తాయి. పాఠశాలలకు వెళ్తున్న చిన్న పిల్లలు ప్రమాదాల బారినపడ తారన్న ఆందోళన అవసరం లేదు. అయితే మేయర్ నిర్ణయంపై మొదట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కార్లు లేకపోతే ఎలా? అని చాలామంది వ్యతిరేకించారు. కానీ మేయర్ నిర్ణయంలో మార్పు లేకపోవడంతో ఒప్పుకోక తప్పలేదు. అయితే ఇప్పుడు నగరవాసులంతా ఆ నిర్ణయంపై సంతోషంగా ఉన్నారు.
నగర వీధుల్లో కార్ల స్థానంలో సైకిళ్లు వచ్చి చేరాయి. అయితే కొన్ని విషయాల్లో మాత్రం మినహాయింపు ఉంది. పెళ్లి జరిగితే వధూవరులు ఇద్దరూ ఒక కారులో రావచ్చు. మిగతా బంధుగణమంతా నడుచుకుంటూనే రావాలి. అంబులెన్సులకు అనుమతినిస్తారు. సరుకు రవాణా వాహనాలకు సైతం నిర్ణీత సమయంలో వచ్చేందుకు అనుమతి ఉంటుంది. ‘‘కార్ల నిషేధం వల్ల క్రమక్రమంగా నగర ప్రజలు నడకకు అలవాటు పడ్డారు. ప్రతీ చిన్నపనికి కారు తీసే అలవాటు తగ్గిపోయింది. నగరాలు ఉన్నది కార్ల కోసం కాదు... మనుషుల కోసం’’ అని పోంటెవెద్రా వాసి కెలెన్ అంటారు. కార్లకు నో చెప్పిన పోంటెవెద్రా ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ కాలుష్యరహిత నగరాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువే.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News