Share News

ముగిసిన గడువు.. వాట్సాప్‌నకు మరో ఛాన్స్ లేదు: కేంద్ర ప్రభుత్వం

ABN , Publish Date - Jul 09 , 2026 | 03:42 PM

వాట్సాప్ ‘యూజర్‌నేమ్’ నోటీసుల గడువు గురువారంతో ముగిసిందని కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ వెల్లడించారు. గడువు పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ముగిసిన గడువు.. వాట్సాప్‌నకు మరో ఛాన్స్ లేదు: కేంద్ర ప్రభుత్వం
WhatsApp Username

ఢిల్లీ, జులై 9 (ఆంధ్రజ్యోతి): వాట్సాప్ ‘యూజర్‌నేమ్’ (WhatsApp Username) నోటీసుల గడువు ఈరోజు(గురువారం)తో ముగిసిందని కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ వెల్లడించారు. గడువు పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ (Central Government) నోటీసులపై వాట్సాప్ (మెటా) యాజమాన్యం నేడు సమాధానం ఇవ్వనుంది. కేంద్రం అనుమతి ఇచ్చే వరకు భారత్‌లో ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌ను తీసుకురాబోమని వాట్సాప్ స్పష్టం చేసింది. వాట్సాప్‌తో పాటు టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లకు కూడా కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు పంపించింది. వాట్సాప్‌లో ఫోన్ నంబర్ లేకుండా చాట్ చేసుకునే ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌పై కేంద్రప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.


ఈ కొత్త ఫీచర్ వల్ల దేశంలో సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు విపరీతంగా పెరిగే ముప్పు ఉందని ఐటీ శాఖ హెచ్చరించింది. వినియోగదారుల ఫోన్ నంబర్లు దాచిపెడితే నేరస్థులను ట్రాక్ చేయడం కష్టమవుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. తమ ప్రభుత్వానికి పూర్తి సంతృప్తి కలిగే వరకు ఈ ఫీచర్‌ను లాంచ్ చేయొద్దని మెటా సంస్థకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే యూజర్‌నేమ్ ఫీచర్ వాడుతున్న టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లకూ నోటీసులు జారీ చేసింది. టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌ల వివరణ కోసం మరికొంత సమయం కేటాయించినట్లు ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్ తెలిపారు.


సైబర్ మోసాల అదుపునకు తాము మల్టీ-లేయర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వాట్సాప్ ప్రతినిధి తెలిపారు. ప్రముఖులు, ప్రభుత్వ ఖాతాల పేర్లను ఇతరులు వాడకుండా ముందే రిజర్వ్ చేస్తామని వాట్సాప్ వివరించింది. దేశంలో వాట్సాప్‌‌నకు రూ.50 కోట్లకు పైగా యూజర్లు ఉన్నందున భద్రతపై రాజీ పడేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనలు, టెలిగ్రామ్ పైరసీ వ్యవహారాలపై కూడా కేంద్రం ఇటీవలే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణలో పెట్టుబడులకు కెనడా ఆసక్తి.. సీఎం రేవంత్‌తో హైకమిషనర్ భేటీ

ధాన్యం కొనుగోళ్లలో కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు.. రేవంత్ సర్కార్‌పై కిషన్‌రెడ్డి ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 09 , 2026 | 04:22 PM