Share News

టీఎంసీకి మరో షాక్.. మేయర్ పదవికి దీదీ సన్నిహితురాలు గుడ్‌బై

ABN , Publish Date - Jun 04 , 2026 | 03:32 PM

బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌‌కు మరో షాక్ తగిలింది. ఏళ్ల తరబడి పార్టీలో ఉన్న మేయర్ కృష్ణా చక్రవర్తి తన పదవికి రాజీనామా చేశారు.

టీఎంసీకి మరో షాక్.. మేయర్ పదవికి దీదీ సన్నిహితురాలు గుడ్‌బై
Bidhannagar Mayor Krishna Chakraborty Resigns

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బిధాన్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కృష్ణా చక్రవర్తి.. గురువారం తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారామె. రాజీనామా అనంతరం ఆమె మాట్లాడుతూ.. 'ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. 16 ఏళ్లుగా నేనీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఎవరి పట్లా నాకే అసంతృప్తి లేదు. నిబంధనల ప్రకారమే రాజీనామా చేశా. నాకు నేను కొంత సమయం కేటాయించాలి అనుకుంటున్నాను. కౌన్సిలర్‌గా కొనసాగుతూ ప్రజలకు సేవ చేయదలచుకున్నాను' అని చెప్పారు.


టీఎంసీ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీకి సన్నిహితురాలిగా ఉన్న కృష్ణా చక్రవర్తి తన రాజీనామా లేఖను మున్సిపల్ కమిషనర్‌కు అందజేశారు. స్థానిక కార్పొరేషన్ అధికారులూ ఆమె రాజీనామా లేఖ అందిన విషయాన్ని ధ్రువీకరించారు. అలాగే రాష్ట్ర పురపాలక వ్యవహారాల శాఖ మంత్రి, అదనపు ప్రధాన కార్యదర్శికి కూడా లేఖ ప్రతులను పంపినట్లు అధికారులు తెలిపారు. ఆమె రాజీనామా ఆమోద ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరుగుతుందని స్పష్టం చేశారు.


కాగా.. తృణమూల్ కాంగ్రెస్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కృష్ణా చక్రవర్తి నిర్ణయం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. టీఎంసీకి సుదీర్ఘకాలంగా సేవలందించిన నేతగా, మమతకు అత్యంత సన్నిహితురాలిగా ఆమెకు పేరుండటంతో ఈ రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది.


ఇవీ చదవండి:

ఢిల్లీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది..

ట్రెక్కింగ్‌కు వెళ్లి యువతి మిస్సింగ్.. ఇద్దరు స్నేహితుల అరెస్ట్

Updated Date - Jun 04 , 2026 | 04:06 PM