టీఎంసీకి కోల్కతా హైకోర్టు షాక్.. రితబ్రత నియామకంపై స్టేకు నిరాకరణ
ABN , Publish Date - Jun 18 , 2026 | 01:13 PM
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కోల్కతా హైకోర్టు షాకిచ్చింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న రితబ్రత బెనర్జీకి వ్యతిరేకంగా దాఖలపైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.
ఇంటర్నెట్ డెస్క్: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా తిరుగుబాటుచేసిన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై కోల్కతా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ కృష్ణారావు నేతృత్వంలోని ధర్మాసనం.. తదుపరి విచారణ జరిపేంత వరకు స్పీకర్ నిర్ణయం అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ పిటిషన్ తదుపరి విచారణకు ముందే అఫిడవిట్ల మార్పిడిని పూర్తి చేయాలని ఇరు పక్షాలను ఆదేశించింది న్యాయస్థానం. ప్రతివాదులు మూడు వారాల్లోగా తమ వ్యతిరేక అఫిడవిట్ను దాఖలు చేయాలని, దానిపై మరో పక్షం వారు రెండు వారాల్లోగా స్పందించాలని గడువు విధించింది. ఈ విషయంపై తదుపరి విచారణ జులై 28కి వాయిదా వేసింది. దీంతో ఈ కేసు ఫలితం వెలువడే వరకు రితబ్రత బెనర్జీ గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేతగా కొనసాగనున్నారు.
కాగా.. టీఎంసీ నుంచి బహిష్కృమైన రితబ్రత బెనర్జీ.. ఆ పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలకు న్యాయకత్వం వహిస్తున్నారు. దీంతో బెంగాల్ రాజకీయ సంక్షోభంలో వివాదం రాజుకుంది. తమకు 58 మంది టీఎంసీ ఎమ్మెల్యేల మద్దతుందని పేర్కొంటూ, ఆమె మేనల్లుడైన అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా ఓ చీలిక వర్గాన్ని ఏర్పాటు చేశారు రితబ్రత. అయితే.. తిరుగుబాటు వర్గం వాదనను అంగీకరిస్తూ రితబ్రతను ప్రతిపక్ష నాయకుడిగా ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్ నియమించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. స్పీకర్ నిర్ణయం అధికారికంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీని పక్కనపెట్టిందని, శాసనసభ పార్టీల గుర్తింపును నియంత్రించే రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘించిందని వాదిస్తూ.. దీదీ వర్గం కోల్కతా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి:
డీఎంకేకు మరో షాక్.! టీవీకే వైపు ఎండీఎంకే.?
బీబీ ఒకసారి ఆలోచించండి.. మీకు కావాల్సినదే దక్కింది: ట్రంప్