‘సర్’ రివిజన్కు సన్నాహక పనులు త్వరగా పూర్తి చేయాలి.. రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు
ABN , Publish Date - Feb 19 , 2026 | 07:50 PM
కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో జరిగే ఎన్నికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కోసం రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సన్నాహకాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచిస్తూ ఎన్నికల అధికారులు లేఖ రాశారు..
ఢిల్లీ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 2026 నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు పలు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు అత్యవసరంగా లేఖలు రాసింది.
ఏప్రిల్ 2026 నుంచి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision - SIR) కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదును అత్యంత పారదర్శకంగా నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 20కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ ఆదేశాలు జారీ చేసింది. వాటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ & కాశ్మీర్, లడఖ్, కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్, సిక్కిం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, మహారాష్ట్ర, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ఉన్నాయి.
అధికారులకు ఆదేశాలు..
సర్ కార్యక్రమానికి సంబంధించి సన్నాహక పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఆయా రాష్ట్రాల అధికారులు చర్యలు చేపట్టాలని సూచించింది. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అధికారులు వీలైనంత త్వరగా సన్నాహకాలను పూర్తి చేసి, ఏప్రిల్ 2026 నుంచి ప్రారంభమయ్యే SIRని సజావుగా జరిగేలా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం దిశానిర్దేశం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు నోటీసులు..
నకిలీ మద్యం కేసు.. నిందితులకు రిమాండ్ పొడిగింపు
Read Latest Telangana News And AP News And Telugu News