భారత్-అఫ్గాన్ తొలి టీ20 మ్యాచ్లో వందేమాతరం ఆలాపన.. కాంగ్రెస్ జోక్యం
ABN , Publish Date - Sep 14 , 2026 | 01:11 PM
ఓ అంతర్జాతీయ స్పోర్టింగ్ ఈవెంట్లో మొట్టమొదటిసారిగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన భారత్-అఫ్గానిస్థాన్ తొలి టీ20 మ్యాచ్ ఆరంభానికి ముందు ఈ సంఘటన జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 14 (ఆంధ్రజ్యోతి): ఓ అంతర్జాతీయ స్పోర్టింగ్ ఈవెంట్లో మొట్టమొదటిసారిగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం భారత్-అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ ఆరంభానికి ముందు ఈ సంఘటన జరిగింది. గేయంలోని మొత్తం ఆరు చరణాలనూ ఆలపించారు. అయితే.. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘భారత్-అఫ్గాన్ మ్యాచ్లో వందేమాతరంలోని ఆరు చరణాలను ప్లే చేయాల్సిన అవసరం ఏముంది? అందులో ఏమైనా లాజిక్ ఉందా? వందేమాతరం పాడితే ఉద్యోగాలు వస్తాయా? లేక మన భారత క్రికెట్ జట్టు మరింత బలోపేతం అవుతుందా? ఇప్పటికే మనం చాలా వెనుకబడి ఉన్నాం. దీనివల్ల సైన్స్ అండ్ టెక్నాలజీలో రంగంలో మనకేమైనా లాభమా?’ అని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ప్రశ్నించారు. మన దేశ ఎగుమతులు ఇప్పటికే తగ్గిపోయాయని, అప్పులు కూడా పెరిగిపోతున్నాయని ఉదిత్ అన్నారు.
కాగా.. 1937 తీర్మానాన్ని చూపుతూ వందేమాతరంలోని రెండు చరణాలు మాత్రమే పాడాలని కాంగ్రెస్ పార్టీ ఇటీవల నిర్వహించిన వర్కింగ్ కమిటీ భేటీలో మరోసారి తీర్మానించుకుంది. 1937లో భారత జాతీయ కాంగ్రెస్.. వందేమాతరంలోని మొదటి 2 చరణాలనే జాతీయ గేయంగా ఎంచుకుంది. 1950 నుంచి భారత రాజ్యాంగ పరిషత్తు దీనిని జాతీయ గేయంగా గుర్తించింది.
కాంగ్రెస్ది ముస్లిం లీగ్ మనస్తత్వం
వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 6న కేంద్ర హోంశాఖ వందేమాతరం ఆలాపన విధానంపై మార్గదర్శకాలను విడుదల చేసింది. దాని ప్రకారం అధికారికంగా వందేమాతరం ఆలపించే సమయం 3 నిమిషాల 10 సెకన్లు. ఒక ప్రదేశంలో గేయం ఆలపిస్తున్నప్పుడు అక్కడున్న ప్రతిఒక్కరూ నిలబడి ఉండాలి. అలాగే రాష్ట్రపతి లేదా గవర్నర్లు పాల్గొనే అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరంలోని మొత్తం 6 చరణాలను పాడాలి. ఇటీవల శ్రీనగర్లో జరిగిన ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో వందేమాతరాన్ని పూర్తిగా ఆలపించడంతో కాంగ్రెస్కు, జమ్మూకశ్మీర్లో ఆ పార్టీ మిత్రపక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్కు మధ్య విభేదాలు తలెత్తాయి. మరోవైపు కాంగ్రెస్ అభ్యంతరంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ముస్లిం బుజ్జగింపు రాజకీయాలు, ముస్లిం లీగ్ ఆలోచనా విధానాన్ని కాంగ్రెస్ ప్రతిబింబిస్తోందని విమర్శించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రోశయ్య దూరదృష్టితోనే తెలంగాణకు మిగులు బడ్జెట్: సీఎం రేవంత్రెడ్డి
ఢీ10 డ్యాన్స్ విన్నర్ రాజు కేసు.. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్
మట్టి వినాయకుడిని పూజించాలి: హరీశ్రావు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News