సైలెంట్ కిల్లర్.. లక్షణాలు లేకుండానే కమ్మేస్తున్న కిడ్నీ వ్యాధి
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:06 AM
కిడ్నీవ్యాధి.. ఇది సైలెంట్ కిల్లర్గా మారింది. లక్షణాలు కనిపించకుండానే యువతను పూర్తిగా కమ్మేస్తోంది.
విలవిల్లాడుతున్న యువత
58.9 శాతం మందిపై ప్రభావం
24.01 శాతం మందికి అధిక రక్తపోటు
అధికంగా పురుషులే బాధితులు
ఏఐఎన్యూ అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్ సిటీ: కిడ్నీవ్యాధి.. ఇది సైలెంట్ కిల్లర్గా మారింది. లక్షణాలు కనిపించకుండానే యువతను పూర్తిగా కమ్మేస్తోంది. వ్యాధి ప్రభావం బయటపడకపోవడంతో చాలామంది తమకు కిడ్నీ జబ్బు ఉందనే విషయాన్నే గుర్తించలేకపోతున్నారు. నగర యువతలో సుమారు 58.9శాతం మంది ఈ వ్యాధి బారిన పడినప్పటికీ దీనిని గుర్తించక వైద్యులను సంప్రదించలేకపోతున్నారు. నగరంలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ) వైద్యులు 2025 వరల్డ్ కిడ్నీ డే నుంచి 2026 వరల్డ్ కిడ్నీ డే (12-3-2026) వరకు ఏడాది పాటు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.
నగరంలో మొత్తం 10,368మందికి పైగా యువకులకు సీబీపీ, మధుమేహం, బీపీ, వంటి కిడ్నీకి సంబంధించిన పలు పరీక్షలను ఏఐఎన్యూ నిర్వహించి ఏడాదిపాటు అధ్యయనం చేసింది. ఈ పరీక్షల్లో కొందరికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)ను ప్రారంభ దశలోనే గుర్తించారు. బాధితుల్లో అధికశాతం పురుషులే ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం తెలంగాణలో సీకేడీ ప్రబలత గత దశాబ్దంలో 3శాతం నుంచి సుమారు 7.4 శాతం వరకు పెరిగిందన్నారు.
ప్రతి నలుగురిలో ఒకరికి..
అధ్యయనంలో పాల్గొన్న వారిలో 24.01 శాతం మందికి హైపర్టెన్షన్ ఉన్నట్లు తేలింది. అంటే ప్రతి నలుగురిలో ఒకరికి అధిక రక్తపోటు ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. స్టేజ్ 3 సీకేడీలో 2.46శాతం మంది, స్టేజ్ 4సీకేడీలో 0.33 శాతం, స్టేజ్ 5 సీకేడీలో 0.07శాతం మంది ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ సంఖ్యలు తక్కువగా కనిపించినప్పటికీ, ముందుగా నిర్ధారణ కాకుండానే నిశ్శబ్ద కిడ్నీ సమస్యలతో జీవిస్తున్న వ్యక్తులు సమాజంలో ఉన్నారని సూచిస్తున్నాయని వివరించారు.
అధ్యయన ప్రధాన లక్ష్యాలు
కిడ్నీ వ్యాధి ప్రారంభ సూచనలను గుర్తించడం, హైపర్టెన్షన్ వంటి ప్రమాద కారకాల ప్రబలతను అంచనా వేయడం, జీవనశైలి, కిడ్నీ మధ్య ఆరోగ్య సంబంధాన్ని అధ్యయనం చేయడం.
స్క్రీనింగ్లో పాల్గొన్న వారి వివరాలు
మొత్తం పరీక్షించిన వారు 10,368 మంది
సగటు వయస్సు 39.06 సంవత్సరాలు
పురుషులు 66 శాతం
మహిళలు : 34 శాతం
యువతలో ప్రభావం
21-40 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు 58.9 శాతం మందిలో కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాం. స్ర్కీనింగ్ చేసిన చాలా మందిలో ఎలాంటి లక్షణాలూ లేవు. అయినా పరీక్షల తర్వాత కిడ్నీ జబ్బు ఇబ్బందులు ఉన్నట్లు బయటపడింది. లక్షణాలు లేకున్నా ముందస్తు పరీక్షలు చేయడం అవసరం. హైపర్టెన్షన్ ఉన్నవారు క్రమం తప్పకుండా కిడ్నీ పనితీరు పరీక్షలు చేయించుకోవాలి.
- డాక్టర్ సుజీత్రెడ్డి, సీనియర్ నెఫ్రాలజిస్టు, ఏఐఎన్యూ
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News