ఇంత ఘోరమా స్వామీ..!
ABN , Publish Date - Apr 03 , 2026 | 09:26 AM
కర్ణాటకలోని చిక్కబళ్ళాపుర జిల్లా శెట్టిగర క్రాస్ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి రక్షితా రెడ్డి(23), ఆమె బంధువు పవన్ రెడ్డి(26) మృతిచెందారు.
రథోత్సవానికి వస్తుండగా ప్రమాదం
పెళ్లైన ఆరు నెలలకే మహిళ మృతి
భర్తకు తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం
సమీప బంధువు కూడా మృతి
విడపనకల్లు, బెంగళూరు: చిక్కబళ్ళాపుర జిల్లా శెట్టిగర క్రాస్ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి రక్షితా రెడ్డి(23), ఆమె బంధువు పవన్ రెడ్డి(26) మృతిచెందారు. రక్షితా రెడ్డి భర్త రాజశేఖర్రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విడపనకల్లు మండలం హావళిగి గ్రామానికి చెందిన మల్లికార్జున రెడ్డి, లక్ష్మి దంపతుల కుమారుడు రాజశేఖర్ రెడ్డికి కర్ణాటకలోని సిరుగుప్ప తాలుకా బూదిగుప్ప గ్రామానికి చెందిన రక్షితా రెడ్డితో ఆరు నెలలు క్రితం వివాహం జరిగింది.
ఇద్దరూ సాఫ్ట్వేరు ఉద్యోగులు కావటంతో బెంగుళూరులో ఉంటున్నారు. తమ స్వగ్రామం హావళిగిలో గురువారం జంబులింగేశ్వరస్వామి రథోత్సవం ఉండటంతో దంపతులు ఇద్దరూ తమ సమీప బంధువు పవన్ రెడ్డితో కలిసి కారులో బయలుదేరారు. వేగంగా వస్తూ, జాతీయ రహదారిపై ముందు వెళుతున్న కంటైనర్ లారీని ఢీకొన్నారు. దీంతో కారు ధ్వంసమైంది. ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో మృతిచెందిన పవన్ రెడ్డి.. రాజశేఖర్ రెడ్డికి పెద్దనాన్న కుమారుడు.
ఆయనది బళ్లారి తాలూక జోళదరాశి గ్రామం. పవన్ రెడ్డి తండ్రి గుత్తి రామిరెడ్డి నెల కిందట చేళ్లగుర్కిలోని ఎర్రితాత దేవాలయంలో భజన చేస్తూ గుండెపోటుతో మృతిచెందారు. ఇంతలోనే కుమారుడు మృతిచెందడంతో వారి ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ ప్రమాదంపై పెరేసంద్ర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిక్కబళ్ళాపుర ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే మృతుల బంధువులు చిక్కబళ్ళాపురకు వెళ్లారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే... జరిగింది!
Read Latest Telangana News and National News