పసిడి పండుగ వచ్చేస్తోంది!
ABN , Publish Date - Apr 16 , 2026 | 10:29 AM
అక్షయ తృతీయ రోజున బంగారు, వెండి ఆభరణాల కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందనే నమ్మకంతో జనం పసిడి దుకాణాలకు క్యూ కడుతున్నారు.
అక్షయ తృతీయకు ఆఫర్ల జోరు
సెంటిమెంట్, భరోసాతో బంగారం కొనుగోళ్లకు జనం మొగ్గు
కేపీహెచ్బీలో కళకళలాడుతున్న దుకాణాలు
హైదరాబాద్: అక్షయ తృతీయ రోజున బంగారు, వెండి ఆభరణాల కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందనే నమ్మకంతో జనం పసిడి దుకాణాలకు క్యూ కడుతున్నారు. ప్రజల నమ్మకాన్ని ఆసరా చేసుకొని దుకాణదారులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించి భారీ ఎత్తున నగలు విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈనెల 19న అక్షయ తృతీయ నాడు పసిడి కొనుగోళ్లకు ప్రజలు సిద్ధమవుతుండగా, కేపీహెచ్బీ, కూకట్పల్లి ప్రాంతాల్లోని బంగారు దుకాణాలు అక్షయ తృతీయకు ఇప్పటికే ముస్తాబయ్యాయి. షాపుల యజమానులు ఈనెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బంగారం కొనుగోళ్లపై ప్రత్యేక రాయితీలు ప్రకటించారు. అవసరం ఉన్నవారు ఈ సమయంలో నగలు కొంటే కొంతమేర ఆర్థిక ప్రయోజనం కూడా ఉంటుంది.
కేపీహెచ్బీ కేంద్రంగా కొనుగోళ్లు..
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తున్న గోల్డ్ జ్యువెలరీ షోరూమ్స్తో పాటు రాష్ట్ర, నగర స్థాయిలో వ్యాపారం చేస్తున్న పలు సంస్థల షాపులు కూకట్పల్లి, కేపీహెచ్బీ ప్రాంతంలో ఉన్నాయి. ఒకప్పుడు ఆబిడ్స్, సోమాజిగూడ, సికింద్రాబాద్ వెళ్లి నగరవాసులు బంగారు నగలు కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. కేపీహెబీ కేంద్రంగా నగలు కొనుగోలు చేసేందుకు నగరవాసులు వస్తున్నారు. దీంతో గత వారం రోజులుగా అక్షయ తృతీయ బుకింగ్స్తో ఇక్కడి నగల దుకాణాలు కళకళలాడుతున్నాయి.
రోజు రోజుకూ బంగారం ధరలు పెరుగుతుండటం, బంగారాన్ని తిరిగి విక్రయిస్తే కొన్న డబ్బులు వచ్చేస్తాయని భరోసా ఉండటంతో జనం ఎంతో కొంత బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారు.
కొందరు పాత నగలు ఎక్స్ఛేంజ్ చేసి కొత్త వాటిని కొనేందుకు డిపాజిట్ చేస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం యువత ఇష్టపడే డిజైన్లు రావడంతో వాటిపై మక్కువ చూపుతున్నారు.
మరికొందరు ఇప్పటికే ఉన్న వాటిని ఉంచుకొని కొత్త డిజైన్లు ఇంటికి తెచ్చుకునేందుకు నగల దుకాణాల్లో పరిశీలిస్తున్నారు. రోజూ వారి కొనుగోళ్లు ఎలా ఉన్నా అక్షయ తృతీయ రోజున డెలివరీ తీసుకునేలా బుకింగ్ చేస్తున్నారు.
మీరు ఎప్పుడు ఆభరణాలు కొన్నా ఏ రోజు తక్కువ రేటు ఉంటే అదే ధరకు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఇది కొంత మేర కస్టమర్కు ఆదా అవుతోంది. రూ.2 లక్షలు ఆపైన కొనుగోలు చేసే వారికి గోల్డ్ కాయిన్ ఫ్రీ అని కొన్ని దుకాణదారులు అంటారు.. కానీ అది ఎంత అన్నది ముందుగా తెలుసుకొని కొనుగోలు చేయండి.
పసిడి కొనుగోలు చేయలేకపోతే వెండి అంటూ నో వేస్జేజ్, మేకింగ్ అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయితే, మీకు ఆ వస్తువులు అవసరమైతేనే ఈ సమయంలో కొనుగోలు చేయడం మంచిది.
ఇన్వె్స్టమెంట్ లేదా తర్వాత మార్చి నచ్చిన వస్తువు తీసుకుందాం అనుకుంటే మాత్రం మీరు ఇప్పుడు కొనుగోలు చేసే ధరలో కనీసం 25-35 శాతం కోత విధిస్తారనే విషయం గుర్తించాలి.
ఇదే సమయంలో 24 క్యారెట్స్ బంగారం ధర చెల్లిస్తే 22 క్యారెట్ల నగలు తీసుకెళ్లవచ్చు అంటున్నారు. ఈ తరహా ఆఫర్ మీకు ఎంత వరకు ఉపయోగపడుతుందో ఆలోచన చేయడమే కాదు.. రెండు, మూడు దుకాణాల్లో ఆఫర్లు పరిశీలించండి.
పసిడి ఆభరణం ఏదైనా హాల్మార్కు తప్పని సరి. క్యాష్, యూపీఐ పేమెంట్స్, కార్డ్స్ ద్వారా పేమెంట్ చేసేటప్పుడు కొందరు అదనపు చార్జీలు వసూళ్లు చేస్తుంటారు. ఏది మీకు అనుకూలమో చూసుకొని పేమెంట్ చేస్తే మీకు ఎంతో కొంత ఆదా అవుతోంది.
కొన్ని చిన్న దుకాణ దారులు మీరు నగదు చెల్లిస్తే జీఎస్టీ 3శాతం లేకుండా ఇస్తామని చెబుతుంటారు. ఇటువంటి వాటి జోలికి పోకపోవడమే మంచిది. రేపు ఎప్పుడైనా ఆ నగలు తాకట్టుపెట్టి రుణం తీసుకోవాలన్నా.. అమ్మాలన్నా లేక నగలు చోరీ జరిగితే కేసు పెట్టాలన్నా ఈ బిల్లు లేకపోవడంతో ఇబ్బందులు వస్తాయి.
ఎంతో పవిత్రమైన అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేసే ఆభరణాల పట్ల అప్రమత్తంగా ఉంటూ సరైన ధరకు కొనుగోలు చేయాలంటే కాస్త సమయం వెచ్చించాల్సిందే.
పరిశీలించండి.. ఆదా చేసుకోండి!
అక్షయ తృతీయ సెంటిమెంట్ను నగల దుకాణదారులు క్యాష్ చేసుకుంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం మేకింగ్ చార్జీలు ఒకటి, రెండు దుకాణాల్లో తప్ప ఎక్కడా తీసుకోవడం లేదు. వీఏ మాత్రం 2-12 మధ్య ఎక్కువ షోరూమ్స్ ఆఫర్ చేస్తున్నాయి. నగలు ధరించాలంటే 22 క్యారెట్స్.. లేదు సెంటిమెంట్ కోసం అంటే 24 క్యారెట్స్ కాయిన్స్, బిస్కెట్స్ కొనుగోలు చేయడం మేలు. ఏడాది తర్వాత తీసుకోవాలనే ఆలోచన ఉంటే మాత్రం గోల్డ్ స్కీమ్స్ కూడా పరిశీలించవచ్చు. ఒక్క జీఎస్ట్ మినహాయించి మీరు ప్రతినెలా చెల్లించే దానికి ఒక నెల బోనస్ లేదా ఏ రోజున పేమెంట్ చేస్తే ఆరోజు లెక్క ప్రకారం చివరిలో ఆభవరణాలు కొనుగోలు చేయవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి:
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు..
శ్రీవారి సర్వదర్శనానికి 10గంటలు
Read Latest Telangana News and National News