ఏలూరు జిల్లాలో పెద్దపులి కలకలం.. ప్రజలకు హై అలర్ట్
ABN , Publish Date - Jun 24 , 2026 | 08:21 AM
ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం పరిధిలోని దండిపూడి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుండటం స్థానికంగా తీవ్ర భయాందోళనలని రేకెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్న ఈ పులి, తాజాగా తన మకాంను దండిపూడి అడవులకు మార్చినట్లు అధికారులు గుర్తించారు.
ఏలూరు జిల్లా, జూన్, 24 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం పరిధిలోని దండిపూడి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుండటం స్థానికంగా తీవ్ర భయాందోళనలని రేకెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్న ఈ పులి, తాజాగా తన మకాంను దండిపూడి అడవులకు మార్చినట్లు అధికారులు గుర్తించారు.
రెండు ఆవులపై పెద్దపులి దాడి..
బుట్టాయిగూడెం మండలం దండిపూడి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి తాజాగా జనావాసాల వైపు వస్తూ పశువులపై దాడి చేస్తోంది. మండల పరిధిలోని నిమ్మలగూడెం గ్రామ శివారు పాలకుంట వద్ద ఉన్న చెరువు సమీపంలో రెండు ఆవులపై పెద్దపులి దాడి చేసి దారుణంగా చంపేసింది.
గ్రామాల్లో పెరిగిన భయాందోళనలు..
నిన్నటివరకు దండిపూడి అడవులకే పరిమితమైన పులి, ఇప్పుడు నిమ్మలగూడెం గ్రామ శివార్లలోని పాలకుంట చెరువు వద్దకు వచ్చి పశువులను చంపేయడంతో చుట్టుపక్కల గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని నిమ్మలగూడెం, దండిపూడి, పరిసర ప్రాంతాల ప్రజలు భయపడిపోతున్నారు.
రేడియో కాలర్ సిగ్నల్స్ ద్వారా గుర్తింపు..
ఈ పెద్దపులి కదలికలను కనిపెట్టేందుకు దానికి ముందే రేడియో ఫ్రీక్వెన్సీ కాలర్ను అమర్చారు. దీని నుంచి వస్తున్న సిగ్నల్స్ ఆధారంగానే పులి ప్రస్తుతం దండిపూడి అటవీ ప్రాంతంలోనే ఉందనే విషయాన్ని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు.
రంగంలోకి ఎన్ఎస్టీఆర్, ఆర్ఆర్టీ బృందాలు..
పులి కదలికలు నిరంతరం పర్యవేక్షించేందుకు నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) సిబ్బందితో పాటు, రాపిడ్ రెస్క్యూ టీమ్ (RRT) రంగంలోకి దిగాయి. స్థానిక అటవీ సిబ్బందితో కలిసి ఈ ప్రత్యేక బృందాలు పులి అడుగుజాడలను, కదలికలను ట్రాక్ చేస్తున్నాయి.
మైకులతో అధికారుల హెచ్చరికలు..
పులి సంచరిస్తున్న నేపథ్యంలో దండిపూడి పరిసర ప్రాంతాల గ్రామస్తులను అటవీ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గ్రామాల్లోకి వాహనాలతో వెళ్లి మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పొలం పనులకు వెళ్లేవారు, పశువుల కాపరులు ఒంటరిగా అడవి వైపు వెళ్లకూడదని సూచించారు. రాత్రి వేళల్లో ప్రజలు సమూహాలుగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రాకపోవడం మంచిదని చెప్పారు. పులి కనిపించినా లేదా దానికి సంబంధించిన ఏమైనా ఆనవాళ్లు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
విశాఖ అగ్నిప్రమాదం.. కార్మికుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. జగన్పై మంత్రి నిమ్మల ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News