Share News

రాధాగాయత్రి కేసులో కీలక మలుపు.. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు

ABN , Publish Date - Jul 07 , 2026 | 09:02 PM

విశాఖపట్నానికి చెందిన రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి నిజానిజాలు వెలికితీసేందుకు డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.

రాధాగాయత్రి కేసులో కీలక మలుపు.. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు
Radha Gayatri case

విశాఖపట్నం, జులై 7 (ఆంధ్రజ్యోతి): సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాధాగాయత్రి తన భర్తతో కలిసి ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీకి ట్రిప్‌నకి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాధాగాయత్రి మృతిపై కేసు (Radha Gayatri case) నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తె మృతికి అల్లుడు శ్రీచరణ్ కారణం అంటూ ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే, ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పూర్తిస్థాయి నిజానిజాలు వెలికితీసేందుకు డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ రాహుల్ ఆనంద్ (Rahul Anand) మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఈ నిర్ణయంతో కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది.


మసూరిలో జూన్ 14వ తేదీ నుంచి 16వ తేదీల మధ్య అసలు ఏం జరిగిందనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ విచారణను మసూరి డివిజనల్ మేజిస్ట్రేట్ నిర్వహిస్తున్నారు. రాధాగాయత్రి మరణానికి దారితీసిన పరిస్థితులు, ఆమె మృతికి ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా రాధాగాయత్రి మృతికి సంబంధించిన ప్రతి అంశాన్ని అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆమె ఆరోగ్య పరిస్థితి, ప్రయాణ వివరాలు, ఘటన జరిగిన సమయంలో ఆమెతో ఉన్న వ్యక్తులు, ఆస్పత్రి రికార్డులు తదితర అంశాలపై సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.


అలాగే రాధాగాయత్రి తల్లిదండ్రులు అక్కడికి చేరుకునేలోపే పోస్టుమార్టం నిర్వహించారనే ఆరోపణలు కూడా ఇప్పుడు విచారణలో కీలక అంశంగా మారాయి. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం ప్రక్రియలో పాల్గొన్న వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పోస్టుమార్టం నిర్వహణకు అనుసరించిన విధివిధానాలు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తీరు వంటి అంశాలను కూడా పరిశీలించనున్నారు. ఈ కేసు ప్రారంభం నుంచే పలు అనుమానాలకు తావిచ్చిన నేపథ్యంలో మజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు జారీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.


ఈ కేసు విచారణ పూర్తయిన అనంతరం రాధాగాయత్రి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రాధాగాయత్రి కుటుంబ సభ్యులు కూడా ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలను బయటపెట్టాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్‌లోనూ చర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి...

పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి: సీఎం చంద్రబాబు

ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లు, లక్ష ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 09:14 PM