మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా దూసుకెళ్తోంది: ప్రహ్లాద్ జోషి
ABN , Publish Date - Jun 16 , 2026 | 09:49 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేబినెట్లో ఏ మంత్రిపై ఏవిధమైన ఆరోపణలు లేవని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా చాలా మార్పులు వచ్చాయని వ్యాఖ్యానించారు.
విజయవాడ, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేబినెట్లో ఏ మంత్రిపై ఏవిధమైన ఆరోపణలు లేవని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) స్పష్టం చేశారు. డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా చాలా మార్పులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతి తక్కువ డేటా ధర ఉన్న దేశం మనదని పేర్కొన్నారు. ఈరోజు (మంగళవారం) విజయవాడలో ప్రహ్లాద్ జోషి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆధార్కు అన్నివిధాలా ఆధారాలు కల్పించామని పేర్కొన్నారు. విద్యుత్ అవసరం 123 గిగావాట్లు దాటిపోయిందని ప్రస్తావించారు. 281 గిగావాట్ల సామర్థ్యాన్ని సైతం చాలా తేలిగ్గా నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు.
విద్యుత్ని అభివృద్ధి చేశాం..
సన్(SUN)తో తాము విద్యుత్ని అభివృద్ధి చేశామని.. కాంగ్రెస్ సన్తో (SON) వెనుకపడిందని ప్రహ్లాద్ జోషి ఎద్దేవా చేశారు. మోదీ 12 ఏళ్లు, చంద్రబాబు 2 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభ సమయం ఇదని తెలిపారు. నెహ్రూ కంటే ఎక్కువ కాలం ప్రధానిగా ఉండటమే గొప్ప కాదని... ప్రధానిగా మోదీ గత 12 ఏళ్లుగా చేసిన అభివృద్ధి గొప్ప అని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం తామే ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెప్పుకున్నారని.. కానీ ఆ పార్టీలో ఏదైనా చేశామని చెప్పుకునే అంశాలు అసలు లేవని చెప్పుకొచ్చారు.
పీవీ నరసింహారావు దేశంలో చాలా మార్పులు చేశారు..
1991లో రాజీవ్ గాంధీ మరణం తర్వాత దేశంలో ఎలక్షన్ మొత్తం వాయిదా వేశారని ప్రహ్లాద్ జోషి తెలిపారు. పీవీ నరసింహారావు దేశంలో చాలా మార్పులు చేశారని కొనియాడారు. 2004 నుంచి 2014 వరకూ కాంగ్రెస్ ఏం చేసిందో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హయాంలో రూ.12 లక్షల కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. ప్రధాని మోదీ ఏ ఎన్నిక కూడా ఓడిపోలేదని తెలిపారు. పాలసీ వైకల్యం ఉన్న ప్రభుత్వం నుంచి నిర్ణయాత్మక ప్రభుత్వంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిందని ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనమైందని విమర్శించారు. మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధిపై చర్చ
ఢిల్లీలో జనసేన సేన ప్రస్థానం సమావేశం.. 5 తీర్మానాలకు ఆమోదం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News