విజయవాడ ఇంద్రకీలాద్రిలో ముగిసిన శాకంబరీ ఉత్సవాలు..
ABN , Publish Date - Jul 29 , 2026 | 10:34 AM
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో దుర్గమ్మ తల్లి శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
విజయవాడ, జులై 29 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో దుర్గమ్మ తల్లి శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. చివరి రోజున అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శాకంబరీ ఉత్సవాల సందర్భంగా మూలవిరాట్తో పాటు ఆలయ ప్రాంగణం మొత్తం వివిధ రకాల ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్తో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రకృతి సంపదను ప్రతిబింబించేలా చేసిన ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
ఇంద్రకీలాద్రి మొత్తం ‘జై దుర్గా.. జై జై దుర్గా’ నామస్మరణతో మార్మోగింది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే శాకంబరీ ఉత్సవాల వెనుక ప్రత్యేక ఆధ్యాత్మిక విశ్వాసం ఉందని భక్తులు చెబుతున్నారు. సకాలంలో వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, దేశం సస్యశ్యామలంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రకృతి, వ్యవసాయం, ఆహార సంపదకు ప్రతీకగా శాకంబరీ దేవిని కొలుస్తారని చెప్పుకొచ్చారు.
అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో ప్రత్యేకంగా కదంబ ప్రసాదాన్ని తయారు చేశారు. ఈ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. కదంబ ప్రసాదాన్ని స్వీకరిస్తే అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారని భక్తులు చెబుతున్నారు. మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు, కార్యక్రమాలతో సాగిన శాకంబరీ ఉత్సవాలు పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మా ఇంట్లో రెండు పార్టీలు: భువనేశ్వరి
ఎర్రబస్సూ రాదన్నారు.. ఎయిర్బస్సు వచ్చేస్తోంది!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News