Pamarru journalist Arrest: పామర్రులో వీరంగం.. ఇద్దరు జర్నలిస్టులు అరెస్ట్
ABN , Publish Date - Jan 12 , 2026 | 01:14 PM
కృష్ణా జిల్లాలో ఇద్దరు జర్నలిస్టులు వీరంగం సృష్టించారు. చల్లపల్లి రోడ్డులోని ఓ మద్యం దుకాణం వద్ద గొడవకు పాల్పడ్డారనే కారణంతో ఇద్దరు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కృష్ణా జిల్లా, జనవరి12 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లాలోని పామర్రులో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు వీరంగం(Pamarru journalist Arrest) సృష్టించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మద్యం మత్తులో సామాన్యులపై దాడి చేయడమే కాకుండా.. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దౌర్జన్యం చేశారు. ఈ క్రమంలో వీరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పామర్రు పోలీసులు వెల్లడించారు.
ఏం జరిగిందంటే..
పామర్రులోని చల్లపల్లి రోడ్డులో ఉన్న ఒక మద్యం దుకాణం వద్ద ఆదివారం రాత్రి సాక్షి మీడియా, సీవీఆర్ ఛానళ్లకు సంబంధించిన రిపోర్టర్లు, మరికొందరు యువకులతో కలిసి తీవ్రస్థాయిలో హల్చల్ చేశారు. మద్యం దుకాణం వద్దకు చేరుకున్న పాత్రికేయులు కిట్టు, సందీప్ సహా మరో ఇద్దరు యువకులు అక్కడి వారితో వాగ్వాదానికి దిగారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ దుకాణంపైకి రాళ్లు విసిరారు.
జనసేన ఇన్ఛార్జ్ డ్రైవర్పై దాడి..
ఈ ఘటన జరుగుతుండగా అక్కడే ఉన్న జనసేన పామర్రు ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేశ్ వారిని ప్రశ్నించారు. ఆగ్రహానికి గురైన జర్నలిస్టులు ఆయన డ్రైవర్ శ్రీకాంత్పై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘర్షణ సమయంలో సదరు విలేకరులు.. ‘టీడీపీ వాళ్లను చంపేస్తాం’ అంటూ కేకలు వేస్తూ భయాందోళనలు సృష్టించినట్లు సమాచారం. దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్కు ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై శ్రీకాంత్ కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
పోలీసులపై దౌర్జన్యం..
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గొడవను ఆపడానికి ప్రయత్నించారు. అయితే.. పోలీసులపైనా అమర్యాదగా ప్రవర్తించి, వారి విధి నిర్వహణకు ఆటంకం కలిగించారా పాత్రికేయులు. ఈ ఘటనతో పామర్రులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.
కేసు నమోదు, అరెస్ట్..
బాధితుడు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పామర్రు పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జర్నలిస్టులు కిట్టు, సందీప్లపై బీఎన్ఎస్ సెక్షన్లు - 353, 324 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ గొడవలో పాల్గొన్న మిగిలిన ఇద్దరు యువకులు విజయవాడకు చెందిన గంజాయి బ్యాచ్కు చెందిన వారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ వార్తలు కూడా చదవండి...
అమరావతి కోసం రైతుల త్యాగం గొప్పది: సీఎం చంద్రబాబు
రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా సమగ్ర సమీక్ష.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News