గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక మలుపు..
ABN , Publish Date - Jul 06 , 2026 | 08:47 PM
గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి విజయవాడ కోర్టు షరతులు విధించిన విషయం తెలిసిందే. ఈ షరతులను సవరించాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దాఖలు చేసిన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.
విజయవాడ, జులై 6 (ఆంధ్రజ్యోతి): గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో (Sai Krishna case) నిందితుడిగా ఉన్న సస్పెండెడ్ సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి విజయవాడ కోర్టు షరతులు విధించిన విషయం తెలిసిందే. ఈ షరతులను సవరించాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దాఖలు చేసిన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు (సోమవారం) విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు పూర్తికాగా, హైకోర్టు తన తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది.
ఈ కేసు విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కీలక వాదనలు వినిపించారు. విజయవాడ కోర్టు విధించిన కొన్ని షరతుల కారణంగా దర్యాప్తు ప్రక్రియకు ఆటంకం కలుగుతోందని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా నిందితుడిని ప్రశ్నించే విధానంలో విధించిన పరిమితులు దర్యాప్తు సమర్థతను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నాగరాజును విచారించే సమయంలో వీడియో రికార్డింగ్ నిర్వహించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అయితే ఆడియో రికార్డింగ్ చేయడం వల్ల దర్యాప్తు గోప్యత దెబ్బతినే ప్రమాదం ఉందని, దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హైకోర్టుకు వివరించారు.
అలాగే నిందితుడు నాగరాజును కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారించడం వల్ల ఆయన హక్కులకు ఎలాంటి భంగం కలగదని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. దర్యాప్తు అవసరాల దృష్ట్యా ఈ విధానం సముచితమని పేర్కొన్నారు.
మరోవైపు నాగరాజు తరఫు న్యాయవాది భిన్న వాదనలు వినిపించారు. తన క్లయింట్కు ప్రాణహాని పొంచి ఉందని, భద్రతాపరమైన కారణాల దృష్ట్యా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణ నిర్వహించకూడదని హైకోర్టును అభ్యర్థించారు. అన్ని రకాల సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు ఉన్న రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనే విచారణ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విన్న హైకోర్టు, ఈ అంశంపై రేపు(మంగళవారం) ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఏపీవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి...
గొడ్డలి పార్టీ మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తోంది.. సీఎం చంద్రబాబు ధ్వజం
మత్స్యకారులను రక్షించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నాం: పవన్ కల్యాణ్
Read Latest AP News And And National News
And Telugu News