అసెంబ్లీకి రాకుండా డీఎస్సీపై విమర్శలా.. వైసీపీపై సీఎం చంద్రబాబు ధ్వజం
ABN , Publish Date - Aug 19 , 2026 | 11:55 AM
అసెంబ్లీ, శాసన మండలిని వైసీపీ సభ్యులు బహిష్కరించటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించటం దేశ చరిత్రలోనే లేదని పేర్కొన్నారు.
అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ, శాసన మండలిని వైసీపీ సభ్యులు బహిష్కరించటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) షాకింగ్ కామెంట్స్ చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించటం దేశ చరిత్రలోనే లేదని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చిస్తే వాటికి ఓ విలువ, గుర్తింపు ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈరోజు (బుధవారం) అసెంబ్లీ లాబీలో మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్చాట్ చేశారు. బయట కూర్చుని వైసీపీ సభ్యులు ఎంత మాట్లాడినా విలువ ఉండదని చెప్పుకొచ్చారు.
నా రాయజకీయ జీవితంలో ఈ విషయం చూడలేదు..
ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీ అనేది అత్యున్నత స్థానమని సీఎం ఉద్ఘాటించారు. అలాంటి వేదికను ఓ పార్టీ మొత్తం బహిష్కరించటం తన రాయజకీయ జీవితంలో ఇలాంటిది చూడలేదని తెలిపారు 1978లో వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డిలు ఇద్దరే అసెంబ్లీని అల్లాడించారని ప్రస్తావించారు.1989 నుంచి1994 సమయంలో ఎన్టీఆర్ మధ్యలో అసెంబ్లీకి రాకపోయినా తామంతా పార్టీ తరఫున అసెంబ్లీకి వెళ్లి ప్రజల తరఫున పోరాడామని చెప్పారు. 2019 నుంచి 2024 మధ్య తాను సవాల్ చేసి బయటకొచ్చినా తమ ఎమ్మెల్యేలు చివరి రోజు వరకూ పోరాటం వదల్లేదని అన్నారు.
గొడ్డలిపార్టీ నాయకుడికి రాజకీయాలు అవసరమా?..
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో తమ వాళ్లు చేసిన పోరాటమే అందరినీ ఆలోచింప చేసిందని సీఎం చెప్పారు. ప్రజలు సభ్యులను ఎన్నుకునేది అసెంబ్లీలో వారి సమస్యలపై పోరాడతారనే నమ్మకంతోనే అని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని చులకన చేసే గొడ్డలిపార్టీ నాయకుడికి రాజకీయాలు అవసరమా? అని ప్రశ్నించారు. గ్రూప్-1 అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకు సభకు రాకుండా బయట కూర్చోని డీఎస్సీపై వైసీపీ సభ్యులు బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు.
బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరించాం..
గొడ్డలి పార్టీ కోతపెట్టిన బీసీ రిజర్వేషన్లను తాము పునరుద్ధరించామని సీఎం స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాన్ని అన్నివర్గాలు స్వాగతిస్తున్నాయని అన్నారు. గొడ్డలి పార్టీ నాయకుడిని, ఆయన అసత్యాలను ప్రజలు విశ్వసించట్లేదని, పట్టించుకోవట్లేదని సీఎం చంద్రబాబు విమర్శించారు.