కోట్లాది హృదయాల్లో శాశ్వతంగా మార్మోగే స్వరం ఎస్పీ బాలుది: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jun 04 , 2026 | 09:40 AM
భారతీయ సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయిన గాన గంధర్వుడు, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు.
అమరావతి, జూన్4 (ఆంధ్రజ్యోతి): భారతీయ సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయిన గాన గంధర్వుడు, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam) జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు. తన అపూర్వమైన గాత్ర మాధుర్యంతో కోట్లాదిమంది సంగీతాభిమానుల హృదయాలను ఆయన గెలుచుకున్నారని వ్యాఖ్యానించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భారతీయ సినీ సంగీతానికి ఒక అజరామరమైన స్వర సంపదను అందించారని ఎక్స్ వేదికగా ప్రశంసించారు.
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సహా పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు ఆలపించి సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారని సీఎం కొనియాడారు. సంగీతానికి ఆయన చేసిన సేవలు, అందించిన పాటలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటాయని వ్యాఖ్యానించారు. తెలుగు భాష, తెలుగు పాట ఉన్నంతకాలం ఎస్పీ బాలు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఆయన స్వరం కేవలం పాటల్లోనే కాదని, కోట్లాదిమంది అభిమానుల హృదయాల్లో శాశ్వతంగా మార్మోగుతూనే ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పాడిన వేలాది పాటల రూపంలో ఎప్పటికీ మన గుండెల్లో జీవించే ఉంటారని తెలిపారు. సంగీతానికి ఆయన చేసిన సేవలను దేశం ఎప్పటికీ మరచిపోదని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ మహా గాయకుడు, గాన గంధర్వుడు, సంగీత సరస్వతీ పుత్రుడికి మరోసారి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నామని సీఎం తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరం: సీఎం చంద్రబాబు
యువత ఓటు హక్కు వినియోగించండి.. ప్రజాప్రతినిధులను ప్రశ్నించండి: కోటంరెడ్డి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News