సింగపూర్ తర్వాత పెట్టుబడులకు ఏపీనే ఉత్తమ గమ్యస్థానం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jun 16 , 2026 | 05:28 PM
సింగపూర్తో భారత్కు, ప్రత్యేకించి ఏపీకి మంచి సంబంధాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సింగపూర్ నిర్మాత లీ క్వాన్ యూ అంటే తనకు చాలా అభిమానమని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): సింగపూర్తో భారత్కు, ప్రత్యేకించి ఏపీకి మంచి సంబంధాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. సింగపూర్ నిర్మాత లీ క్వాన్ యూ అంటే తనకు చాలా అభిమానమని పేర్కొన్నారు. మూడు దశాబ్దాల క్రితం నుంచే సింగపూర్తో కలిసి పనిచేస్తున్నామని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో సింగపూర్ టౌన్ షిప్నే నిర్మించామని ప్రస్తావించారు. ఈరోజు(మంగళవారం) సింగపూర్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్-2026 బిజినెస్ రోడ్ షోకి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ ఏడాది నవంబర్లో జరగనున్న పార్టనర్షిప్ సమ్మిట్ సన్నాహక సమావేశంగా సింగపూర్లో తొలి రోడ్ షోని సీఐఐ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ని తయారు చేశామని తెలిపారు. బ్లూ, గ్రీన్ రాజధానిగా అమరావతి నిర్మాణం కోసం ఓ అద్భుతమైన బృహత్ ప్రణాళికను సింగపూర్ రూపొందించిందని వెల్లడించారు.
సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం..
ఏపీ రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని నగరాల అభివృద్ధి తదితర అంశాల్లో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. సింగపూర్ తర్వాత పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ప్రాంతమని స్పష్టం చేశారు. సింగపూర్ తర్వాత రెండో నివాసంగా అమరావతిని, ఏపీని మార్చుకోమని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. ఏపీలో భూమి, అనుమతులను వేగంగా జారీ చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ దిగ్గజ స్టీల్ కంపెనీ ఆర్సెలార్ మిట్టల్కు అన్ని అనుమతులు వేగంగా ఇచ్చామని చెప్పుకొచ్చారు. 2028 నాటికి ఆర్సెలార్ మిట్టల్ ఉత్పత్తి కూడా ప్రారంభించి ఏపీ నుంచి ఎగుమతులు చేస్తుందని తెలిపారు. అలాగే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటవుతుందని.. వారికి గ్రీన్ ఎనర్జీని సరఫరా చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
ఆపరేషనల్ స్కిల్ యూనివర్శిటిని ఏర్పాటు చేస్తున్నాం..
పెట్టుబడులు వచ్చిన మరుక్షణం నుంచే పరిశ్రమలు ప్రారంభించేలా ఓ నిర్దిష్టమైన కాలవ్యవధిని నిర్ణయిస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. గూగుల్తో పాటు దాదాపు 10 గిగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లను వివిధ కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నాయని ప్రస్తావించారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా రూ.7 వేల కోట్లతో శ్రీసిటీలో గృహోపకరణాల తయారీ యూనిట్ను ప్రారంభిస్తోందని తెలిపారు. ఏపీలో అమలవుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఇవి ప్రత్యక్ష ఉదాహరణలని చెప్పుకొచ్చారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులను తయారు చేసేందుకు ఆపరేషనల్ స్కిల్ యూనివర్శిటినీ కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పనిచేస్తూనే నైపుణ్యాలు, ఉన్నత విద్యార్హతలను సాధించేలా ఈ ఆపరేషనల్ యూనివర్శిటీలు ఉపయోగపడుతాయని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ విస్తృతి పెరిగిందని.. దీని ఆధారంగానే నిర్ణయాలు ఉంటున్నాయని చెప్పుకొచ్చారు. ఏపీలోనూ అదే తరహాలో డేటా డ్రివెన్ నిర్ణయాలను తీసుకుని పౌరసేవల్ని అందిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధిపై చర్చ
ఢిల్లీలో జనసేన సేన ప్రస్థానం సమావేశం.. 5 తీర్మానాలకు ఆమోదం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News