చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:39 AM
చిత్తూరు జిల్లాలోని పలమనేరు శివారులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
చిత్తూరు జిల్లా, మార్చి 4(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలోని పలమనేరు శివారులో ఇవాళ(బుధవారం) ఘోర రోడ్డు ప్రమాదం (Chittoor District Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలమనేరు జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీని ఓ కారు వెనుక వైపు నుంచి అత్యంత వేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ కారు పూర్తిగా ధ్వంసమైంది. మృతులు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలోని రాజాజీ నగర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. వారు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చిత్తూరు జిల్లా పోలీసులు తెలిపారు.
మృతుల వివరాలివే..
మోహన్ దాస్ (71)
నాగరాజారావు (61)
కుసుమ (61)
జయంతి (59)
పూజ (33)
పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించి, బంధువులకు సమాచారం ఇచ్చారు.
మంత్రి మండిపల్లి ఆరా..
పలమనేరు ప్రమాదంపై ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని అధికారులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు.
పోలీసుల దర్యాప్తు..
ఈ ప్రమాదానికి కారణం కారుడ్రైవర్ నిర్లక్ష్యమా..? ఇతర సాంకేతిక కారణాలేమైనా ఉన్నాయా..? అనే కోణంలో చిత్తూరు జిల్లా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారులపై వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటనతో పలమనేరు ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
వినూత్న బోధనలో ఆ టీచర్ ఆదర్శంగా నిలిచారు: మంత్రి నారా లోకేశ్
హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ.. ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And Telugu News