ఏపీలో ఆన్లైన్ బెట్టింగ్పై పోలీసుల ఉక్కుపాదం..
ABN , Publish Date - Feb 17 , 2026 | 09:28 PM
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, ఆన్లైన్ జూదం, బెట్టింగ్ కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా తిరుపతి నగరంలో ఒక ప్రధాన బెట్టింగ్ కేంద్రాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు..
తిరుపతి, ఫిబ్రవరి17 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ (Tirupati Online Betting), క్రికెట్ క్యాసినో కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో తిరుపతి పట్టణంలోని బైరాగిపట్టెడ, పద్మావతి పార్క్ సమీపంలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ గ్యాంగ్ నెట్వర్క్పై పోలీసుల దృష్టి..
వారి వద్ద నుంచి రూ.7,48,000 నగదు, ఒక ల్యాప్టాప్, 04 మొబైల్ ఫోన్లు, 04 పేటీఎం క్యూ ఆర్ కోడ్ బాక్స్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఆధారంగా పోలీసులు బ్యాంక్ లావాదేవీలు, డిజిటల్ ట్రాన్సాక్షన్లను పరిశీలించారు. వీరు రహస్యంగా ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్ల ద్వారా బెట్టింగ్ నెట్వర్క్ను నడుపుతున్నట్లు గుర్తించారు. ఈ బెట్టింగ్ నెట్వర్క్ వెనుక ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించడానికి తిరుపతి జిల్లా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
జిల్లా ఎస్పీ హెచ్చరిక..
జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఈ సందర్భంగా కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్, క్యాసినో వంటి అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించాలని చూసే వారిపై కఠిన చట్టాలను ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. యువత ఇలాంటి వ్యసనాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. ఎక్కడైనా ఇలాంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యువతను మత్తుపదార్థాలకు దూరంగా ఉంచేలా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ సుబ్బారాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ కుటుంబమే తిరుమల పవిత్రతని దెబ్బతీసింది.. అచ్చెన్నాయుడు ధ్వజం..
వేంకటేశ్వరస్వామితో ఆటలాడే వారెవరూ బతికి బట్టకట్టలేదు.. స్వామి శ్రీనివాసనంద సరస్వతి ఫైర్
Read Latest Telangana News And AP News And Telugu News